దయ చేసి ప్రజలు 100కు డయల్‌ చేయండి: డీజీపీ

12 Oct, 2020 20:28 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో డీజీపీ మహేందర్‌రెడ్డి రాష్ట్ర పోలీసు శాఖను అప్రమత్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజుల పాటు భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ  శాఖ హెచ్చరించిన విషయం తెలిసిందే. దీంతో సీఎం కేసీఆర్‌ ఆదేశం మేరకు డీజీపీ స్టేషన్‌ హౌజ్‌ ఆఫీసర్ల నుంచి జిల్లా ఎస్‌పీలు, పోలీసు కమిషనర్లందరూ అప్రమత్తంగా ఉండాలని సోమవారం ఆదేశించారు. పోలీసు అధికారులందరూ 24 గంటల పాటు విధుల్లో ఉండి ప్రజలకు ఏవిధమైన అసౌకర్యం కలుగకుండా చూడాలని హెచ్చరించారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు, వరద తీవ్రత అధికంగా ఉండే ప్రాంతాలపై ప్రత్యేక పర్యవేక్షణ ఉంచాలన్నారు. జిల్లా కలెక్టర్లు, విపత్తు నివారణ శాఖలతో పాట ఇతర శాఖలతో సమన్వయంతో పని చేయాలని సూచించారు. ప్రధానంగా డయల్‌ 100కు వచ్చే కాల్స్‌ అన్నింటీకి ప్రాధాన్యతతో చేపట్టి పరిష్కరించాలని స్పష్టం చేశారు. ఎక్కడ ఏవిధమైన ఇబ్బందులు ఎదురైన డయల్‌ 100కు ఫొన్‌ చేయాలని రాష్ట్ర ప్రజలను డీజీపీ కోరారు.

రాష్ట్ర వ్యాప్తంగా హై అలర్ట్‌ ప్రకటించిన డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌
తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే నేపథ్యంలో డిజాస్టర్‌ మేనేజ్‌మేంట్‌ డైరెక్టర్‌ హైదరాబాద్‌లో హైఅలర్ట్ ప్రకటించారు. 12,13,14 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్ష సూచన ఇస్తూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో జీహేచ్‌ఎంసీ మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలను రఃగంలోకి దింపింది. ముంపు ప్రాంతాలను గుర్తించి నిర్వాసితుల కోసం అన్నీ ఏర్పాట్లు చేయాలని జీహేచ్‌ఏంసీ ఆదేశించింది. వరదలు ఎక్కవగా ఉన్న ప్రాంతాల్లో పరికరాలు, మిషన్స్ తరలించాలని, నిర్వాసితులను తరలించేందుకు వాహనాలు సిద్ధం చేసుకోవాలని అన్నీ జోనల్ కమిషనర్‌లను జీహేచ్‌ఎంసీ ఆదేశించింది.

మరిన్ని వార్తలు