అంతరిక్షంలో ‘ధృవ’

18 Mar, 2022 01:58 IST|Sakshi

న్యూ స్పేస్‌ ఇండియాతో కీలక ఒప్పందం 

ఈ ఒప్పందంతో అంతరిక్షంలో ప్రైవేటు వాణిజ్య ప్రయోగ సేవలకు శ్రీకారం 

అంతరిక్ష వాహక నౌకల్లో భద్రతా ప్రమాణాలు పెంపు

సాక్షి, హైదరాబాద్‌: అంతరిక్ష రంగంలో ప్రైవేటు సంస్థల భాగస్వామ్యానికి కేంద్ర ప్రభుత్వం నిబంధనలు సడలించిన నేపథ్యంలో... కేంద్ర అంతరిక్ష విభాగానికి చెందిన ప్రభుత్వ రంగ సంస్థ ‘న్యూ స్పేస్‌ ఇండియా లిమిటెడ్‌’(ఎన్‌ఎస్‌ఐఎల్‌)లో హైదరాబాద్‌కు చెందిన అంతరిక్ష ఇంజనీరింగ్‌ పరిష్కారాల ఆవిష్కర్త ‘ధృవ స్పేస్‌ ప్రైవేటు లిమిటెడ్‌’ గురువారం ఒప్పందం కుదుర్చుకుంది.

ఈ ఒప్పందం ప్రకారం అంతరిక్ష రంగంలో తొలిసారి ప్రైవేటుగా వాణిజ్య ప్రయోగ సేవల్ని ‘ధృవ స్పేస్‌’అందించనుంది. స్పేస్‌క్రాఫ్ట్‌ ప్లాట్‌ఫారం, నియంత్రణ, సమాచార, విద్యుత్‌ వ్యవస్థలు, సోలార్‌ ప్యానెళ్లతో ఉపగ్రహ ప్రయోగ రంగంలో ‘ధృవ స్పేస్‌ ఆర్బిటల్‌ డిప్లాయర్స్‌’(డీఎస్‌ఓడీ) పేరిట కొత్త సాంకేతికతను అభివృద్ధి చేసింది. ఉపగ్రహ వాహక నౌకల్లో భద్రతా ప్రమాణాలు, కచ్చితత్వం నెలకొల్పడంతో పాటుగా వాటిని మరింత సులువుగా ప్రయోగించడంలో ఈ సాంకేతికత ఉపయోగపడనుంది.  

ఒప్పందానికి తొలిమెట్టు డీఎస్‌ఓడీ టెక్నాలజీ 
పోలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌ (పీఎస్‌ఎల్‌వీ), స్మాల్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌ (ఎస్‌ఎస్‌ఎల్‌వీ)లో ధృవ తన డీఎస్‌ఓడీ సాంకేతికత ద్వారా ప్రయోగ సేవలు అందించడానికి ఇది తొలిమెట్టు. ఒప్పం దం మేరకు ధృవ తొలుత ‘డీఎస్‌ఓడీ –1యు ç పరీ క్షించనున్నారు. ఉపగ్రహం నిర్దేశిత కక్ష్యలోకి చేరింది లేనిదీ కచ్చితంగా తెలిపే సెన్సర్లు ఈ సాంకేతికతలో కీలకంగా పరిగణిస్తున్నారు.

మరో ఏడాది కాలంలో మరింత సామర్థ్యంతో కూడిన డీఎస్‌ఓడీ 3యు, 6యు, 12యు డిప్లాయర్స్‌ పనితీరునూ ‘ధృవ’ పరీక్షించనుంది. ఇన్‌స్పేస్, ఇస్రో, కేంద్ర అంతరిక్ష విభాగం నుంచి లభించిన మద్దతుతో స్మాల్‌ శాటిలైట్‌ సాంకేతికతలో దేశీయ ఆవిష్కరణలకు చోటు లభించిందని ధృవ స్పేస్‌ సీఈఓ సంజయ్‌ నెక్కంటి వ్యాఖ్యానించారు. దీంతో భారతీయ అంతరిక్ష స్టార్టప్‌లకు మరింత ఊతం లభిస్తుందని ఎన్‌ఎస్‌ఐఎల్‌ సీఎండీ డాక్టర్‌ రాధాకృష్ణ దురైరాజ్‌ చెప్పారు.   

మరిన్ని వార్తలు