బెస్ట్‌ కోవిడ్‌ వారియర్‌ ఆఫీసర్‌గా డీఐజీ సుమతి

19 Jan, 2021 08:56 IST|Sakshi
డీఐజీ బడుగుల సుమతి (ఫైల్‌ఫోటో)

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో బెస్ట్‌ కోవిడ్‌ వారియర్‌ విమెన్‌ ఆఫీసర్‌గా డీఐజీ బడుగుల సుమతిని డీజీపీ ఎంపిక చేశారు. కోవిడ్‌ విజృంభించిన వేళ దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించిన విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌ కాలంలో పోలీసులు అందించిన సేవలు మరువలేనివి. మన రాష్ట్రంలో దాదాపు ఆరు వేలకుపైగా పోలీసులు వైరస్‌ బారిన పడగా.. దాదాపు 70 మంది పోలీసులు అమరులయ్యారు. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌ కాలంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన మహిళా పోలీసు అధికారుల వివరాలు అందజేయాలని నేషనల్‌ విమెన్‌ కమిషన్‌ (ఎన్‌సీ డబ్ల్యూ) అన్ని రాష్ట్రాలకు లేఖలు రాసింది. దీంతో తెలంగాణ నుంచి డీఐజీ బడుగుల సుమతి పేరుని సోమవారం డీజీపీ డాక్టర్‌ ఎం.మహేందర్‌ రెడ్డి ఖరారు చేశారు. (చదవండి: ఆన్‌లైన్‌ క్లాసులు.. ఓ కంట కనిపెట్టండి)

డీఐజీ సుమతి లాక్‌డౌన్‌ కాలంలో డీజీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూంలో సేవలందించారు. లాక్‌డౌన్‌ కాలంలో పేదలు, వలస కూలీలు, అన్నార్థులకు ఎక్కడికక్కడ ఆహారం, మందులు, బియ్యం, దుస్తులు చేరేలా నిరంతరం పర్యవేక్షించారు. అదే విధంగా అత్య వసర సేవలు, రాష్ట్రంలోనికి రావాల్సిన దిగు మతులు, ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన ఎగుమతులకు ఎలాంటి ఆటంకం లేకుండా కొనసాగించే బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తించారు. 
 

మరిన్ని వార్తలు