హైదరాబాద్ నుంచి దుబాయికి విమాన సర్వీసులు

10 Sep, 2020 20:08 IST|Sakshi
ఫైల్ ఫోటో

 హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి  దుబాయికి  డైరెక్ట్  విమానాలు  

‘ఎయిర్ ట్రావెల్ బబుల్’ ఒప్పందం కింద సర్వీసులు పున:ప్రారంభం 

ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్ ద్వారా వారానికి మూడు సర్వీసులు

ప్రయాణికులందరికీ కోవిడ్-19 భద్రతా ప్రోటోకాల్‌కు లోబడి పరీక్షలు

సాక్షి, హైదరాబాద్: ఇతర దేశాలతో విమాన ప్రయాణ సౌకర్యాలు తిరిగి ప్రారంభించే దిశగా, భారత, యూఏఈ ప్రభుత్వాల మధ్య కుదిరిన ‘ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ బబుల్’ ఒప్పందం ప్రకారం జీఎంఆర్   ఆధ్వర్యంలోని (శంషాబాద్) హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి దుబాయికి విమాన సర్వీసులు తిరిగి ప్రారంభమయ్యాయి. కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో కోలుకుంటున్న పౌర విమాన రంగానికి ఈ చర్య ఊతమివ్వనుంది. 

యూఏఈకి చెందిన ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్‌  ప్రతి ప్రతి మంగళ, గురు, ఆదివారాలలో వారాని మూడు సర్వీసులను నిర్వహిస్తుంది. భారత ప్రభుత్వ హోమ్ వ్యవహారాల శాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా ఏ ప్రయాణికుడైనా హైదరాబాద్ నుంచి దుబాయికి టికెట్టును బుక్ చేసుకోవచ్చు. ప్రయాణికులందరూ కోవిడ్-19 మార్గదర్శకాలకు లోబడి ఉండాల్సి ఉంటుంది.కోవిడ్ మహమ్మారి కారణంగా దెబ్బ తిన్న ఆర్థికవ్యవస్థను గాడిలో పెట్టడానికి భారత ప్రభుత్వం అన్‌లాక్ 3.0 సందర్భంగా, వివిధ దేశాలతో ‘‘ట్రాన్స్‌పోర్ట్ బబుల్స్’’ లేదా ‘‘వాయు రవాణా ఒప్పందాలు’’ అనే తాత్కాలిక ఏర్పాట్లకు అనుమతించింది. దీని కింద ఏవైనా రెండు దేశాలు కోవిడ్-19 మహమ్మారి కారణంగా రద్దైన రెగ్యులర్ అంతర్జాతీయ సర్వీసులను పున:ప్రారంభించుకోవచ్చు. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఇప్పటికే పలు జాగ్రత్తల మధ్య అంతర్జాతీయ విమానాల రాకపోకలు జరుగుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా వైరస్ నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి అతి తక్కువ ప్రయాణ సమయంతో, అత్యంత జాగ్రత్తల మధ్య జరిగే విమాన ప్రయాణాలే అత్యంత సురక్షితమైనవిగా తేలింది. మే 25న హైదరాబాద్ విమానాశ్రయం నుంచి విమాన సర్వీసులు పున:ప్రారంభమైన నాటి నుంచి జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సురక్షితమైన ప్రయాణం కొరకు డిపార్చర్ ర్యాంప్ నుంచి బోర్డింగ్ గేటు వరకు పూర్తి శానిటైజ్ చేసిన కాంటాక్ట్-లెస్ అనుభవాన్ని ప్రయాణికులకు అందిస్తోంది.

మరిన్ని వార్తలు