Disha Encounter Case: కమిషన్‌కు వింత సమాధానాలు చెప్పిన డ్రైవర్‌ 

1 Oct, 2021 08:00 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘దిశ’హత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్‌పై జస్టిస్‌ వీఎస్‌ సిర్పుర్కర్‌ కమిషన్‌ విచారణ కొనసాగుతోంది. 2019 డిసెంబర్‌ 5న నిందితులను గచ్చిబౌలిలోని సైబరాబాద్‌ కమిషనరేట్‌ నుంచి రంగారెడ్డి జిల్లా చటాన్‌పల్లిలో దిశ మృతదేహాన్ని కాల్చే సిన ప్రాంతానికి సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ కోసం తీసుకెళ్లిన వాహనం డ్రైవర్‌ యాదగిరిని గురువారం త్రిసభ్య కమిషన్‌ విచారించింది.

ఎన్‌కౌంటర్‌ సమయంలో మీకు బుల్లెట్ల శబ్దం వినిపించిందా? అని డ్రైవర్‌ను ప్రశ్నించగా.. ‘లేదు, ఆ సమయంలో నేను వాహనంలోనే పడుకున్నా’అని డ్రైవర్‌ సమాధానమిచ్చినట్లు తెలిసింది. ఆ తర్వాత ఎన్‌కౌంటర్‌లో మరణించిన నిందితుల మృతదేహాలకు పోస్ట్‌మార్టం నిర్వహించిన గాంధీ ఆసుపత్రి వైద్యులు డాక్టర్‌ కృపాల్‌ గుప్తా, బీబీనగర్‌లోని ఎయిమ్స్‌ ఫోరెన్సిక్‌ హెడ్‌ డాక్టర్‌ సుధీర్‌ గుప్తాలను కూడా కమిషన్‌ విచారించింది.

మృతదేహాలకు పోస్ట్‌మార్టం ఎందుకు నిర్వహించలేదని కృపాల్‌ గుప్తాను ప్రశ్నించగా.. మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ఇవ్వలేదని పొంతనలేని సమాధానం చెప్పినట్లు తెలిసింది. మృతదేహాలపై ఏమైనా గాయాలున్నాయా అని ప్రశ్నించగా.. లేవని కృపాల్‌ సమాధానమివ్వగా, సుధీర్‌ గుప్తా మాత్రం మృతదేహాలపై పోలీసులు కొట్టినట్లు గాయాలున్నాయని చెప్పినట్లు సమాచారం. శుక్రవారం కూడా గాంధీ ఆసుపత్రి వైద్యుల విచారణ కొనసాగనుంది. దిశ ఎన్‌కౌంటర్‌ సమయంలో సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌గా ఉన్న వీసీ సజ్జనార్‌ను సోమవారం విచారించే అవకాశం ఉంది.

చదవండి: Tollywood Junior Artists: ప్రియుడు మోసం చేయడంతో టాలీవుడ్‌ జూనియర్‌ ఆర్టిస్ట్‌ ఆత్మహత్య

మరిన్ని వార్తలు