Disha Encounter: ‘దిశ’ తండ్రి ఏమన్నారంటే..

6 Dec, 2021 13:43 IST|Sakshi

సంచలన వ్యాఖ్యలు చేసిన దిశ తండ్రి

సాక్షి, హైదరాబాద్‌: సరిగా రెండేళ్ల క్రితం.. ఇదే రోజున తెలంగాణ పోలీసులపై జనాలు పూల వర్షం కురిపించారు. రియల్‌ హీరోలు అంటూ ప్రశంసించారు. సామాన్యంగా పోలీసులంటే జనాల్లో ఉండే భయం ఆ రోజు దూరమయ్యింది. దేశవ్యాప్తంగా కూడా తెలంగాణ పోలీసులను ప్రశంసించారు. వారిని హీరోలుగా చేసిన సంఘటన ఏంటంటే.. 2019, నవంబర్‌ 27న ఓ అమ్మాయిపై మృగాళ్లు దారుణ మారణకాండకు పాల్పడ్డారు. ఆ దారుణం ప్రతి ఒక్కరిని కదిలించింది. ఈ సంఘటనపై పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం అయ్యింది. మృగాళ్లకు ఎన్‌కౌంటరే సరైన శిక్ష అని ప్రజలు భావించారు. 

ఈ క్రమంలో 2019 డిసెంబర్‌ 6న తెల్లవారు జామున ‘దిశ’ను హతమార్చిన నలుగురిని సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ కోసం చటాన్‌పల్లి బ్రిడ్జి వద్దకు తీసుకొచ్చారు. ఈ క్రమంలో నిందితులు పోలీసులపైకి తిరగబడటంతో పోలీసులు వారిని ఎన్‌కౌంటర్‌ చేశారు. ఆరీఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవులు ఎన్‌కౌంటర్‌లో మృతి చెందారు. ఈ సంఘటనపై సర్వత్రా హర్షం వ్యక్తం అయ్యింది. పోలీసులపై జనాలు పూల వర్షం కురిపించారు. 
(చదవండి: ‘దిశ’హత్యాచార ఘటన: పోలీసులు చెప్పిందే నమోదు చేస్తారా? )

ఎన్‌కౌంటర్‌ ఘటనపై విచారణ కోసం సుప్రీంకోర్టు త్రిసభ్య కమిషన్‌ను నియమించింది. ఈ క్రమంలో దారుణం చోటు చేసుకున్న రెండేళ్లు పూర్తయినప్పటికి.. దిశ కుటుంబ సభ్యులు ఆ బాధ నుంచి కోలుకోలేదు. ఈ క్రమంలో దిశ తండ్రి మాట్లాడుతూ.. ‘‘లైంగిక నేరగాళ్లకు కఠిన శిక్ష విధించాలి. ఇలాంటి దారుణాలు చోటు చేసుకున్న సమయంలో న్యాయవ్యవస్థ సత్వరమే స్పందించాలి. నెల రోజుల్లోగా నిందితులకు కఠిన శిక్ష విధించాలి. న్యాయవ్యవస్థలో సంస్కరణలు చేయకపోతే.. బాధితులకు, వారి కుటుంబాలకు ఎన్నటికి న్యాయం జరగదు’’ అన్నారు.
(చదవండి: మళ్లీ తెరపైకి దిశ నిందితుల ఎన్‌కౌంటర్ ఘటన)

సమాజంలో ఇలాంటి దారుణాలు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. పోలీసులు ఎందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం లేదు. పాఠశాలలు, కాలేజీల్లో విద్యార్థులకు లైంగిక నేరాల పట్ల అవగాహన కల్పించాలి. ఇలాంటి దారుణాలు నుంచి తమను తాము ఎలా కాపాడుకోవాలో వారికి శిక్షణ ఇవ్వాలి అని కోరారు. 

చదవండి: Disha Encounter: సంచలనం.. చర్చనీయాంశం

మరిన్ని వార్తలు