'మామ అల్లుళ్ళ కలలు నిజం కావు'

27 Oct, 2020 13:16 IST|Sakshi

కేసీఆర్‌, హరీష్‌కు అబద్ధాల్లో డాక్టరేట్లు ఇవ్వొచ్చు

దుబ్బాక ఫలితంతో పునాదులు కదలబోతున్నాయి

బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ

సాక్షి, కరీంనగర్‌: దుబ్బాక సీపీని సస్పెండ్‌ చేయాలనే డిమాండ్‌తో నిరాహారదీక్షకు దిగిన బండి సంజయ్‌ను మంగళవారం రోజున బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘తెలంగాణ రాష్ట్ర బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై దాడి హేయమైన చర్య. టీఆర్ఎస్ ఓటమి భయం, అధికార దాహంతో బీజేపీ నేతలపై దాడులకు తెగబడుతున్నారు. క్షేత్ర స్థాయిలో బీజేపీ గెలుపు ఖాయం అయిన నేపథ్యంలో ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. టీఆర్ఎస్‌కు ఓటు వేయకుంటే సంక్షేమ పథకాలు రావని ప్రజల్ని బెదిరింపులకు గురి చేస్తున్నారు. ఓటమి భయంతోనే ఇలాంటి అలజడులు రేపుతున్నారు.  (పోలీసులే ఆ డబ్బు పెట్టారు: సంజయ్‌)

దుబ్బాకలో టీఆర్ఎస్ పార్టీని ఓడించాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. అల్లున్ని ముందు పెట్టి కేసీఆర్ వెనుకుండి నడిపిస్తున్నారు. హరీష్ రావు కేంద్రం మీద ఏడవడం తప్ప, రాష్ట్రానికి ఏం చేశారో ప్రజలకు చెప్పాలి. కేంద్రం ఇచ్చిన నిధులతోనే రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి హరీష్‌కు అబద్ధాల విషయంలో డాక్టరేట్లు ఇవ్వొచ్చు. మీ పునాదులు దుబ్బాక ఫలితంతో కదలబోతున్నాయి' అని డీకే అరుణ టీఆర్‌ఎస్‌పై విమర్శలు సంధించారు. సిద్దిపేట జిల్లా బీజేపీ అధ్యక్షుడితో పాటు మరో కార్యకర్తను అరెస్టు చేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. వారిని పోలీసులు వెంటనే విడుదల చేయాలని డీకే అరుణ డిమాండ్‌ చేశారు.  (భయపడొద్దు.. ఎదుర్కొందాం : కిషన్‌రెడ్డి)

బీజేపీ నేత, మాజీ మంత్రి బాబు మోహన్ మాట్లాడుతూ.. 'దుబ్బాక ఉపఎన్నికతో సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావుకు ముచ్చెమటలు పడుతున్నాయి. బీజేపీ గెలుస్తుందనే భయంతో హరీష్ రావు అలజడి సృష్టిస్తున్నారు. మామ అల్లుళ్ళ మెప్పుకోసం సీపీ ఏదైనా చేస్తాడు. సచ్చిపోయే వరకు అధికారంలో ఉంటామనే మామ అల్లుళ్ళ కళలు నిజం కావు. కార్యకర్తలు మనోధైర్యంతో ఉండాలి' అని బాబు మోహన్ అన్నారు.
(డీకే అరుణ ఇంటి వద్ద హైడ్రామా)

మరిన్ని వార్తలు