సూపర్‌ వ్యాక్సిన్‌.. అన్ని వేరియంట్లకు అడ్డుకట్ట

26 Jun, 2021 02:13 IST|Sakshi

కరోనా అన్ని వేరియంట్లకూ ఆ టీకాతో అడ్డుకట్ట...

సెకండ్‌ వేవ్‌ ఇంకా ముగియలేదు.. తాకిడి మాత్రమే తగ్గింది! 

డెల్టా ప్లస్‌ పట్ల అప్రమత్తత అవసరం.. మరీ ఆందోళన చెందొద్దు 

వ్యాక్సిన్, మాస్క్‌లు, ఇతర జాగ్రత్తలతో రక్షణ 

డెల్టా ప్లస్‌కు వ్యాపించే సామర్థ్యం ఎక్కువగా ఉన్నా.. అందుకు మనం ఆస్కారం ఇస్తున్నామా అన్నది ముఖ్యం. లాక్‌డౌన్‌ సడలించారన్న ఉద్దేశంతో జనం గుమిగూడటం, కొవిడ్‌ నిబంధనలు పాటించకుండా ఇష్టమొచ్చినట్టు తిరిగితే అందరినీ ఇన్ఫెక్ట్‌ చేసే అవకాశం ఉంటుంది. 
ప్రజలు గుంపులుగా చేరకుండా ప్రభుత్వ పరంగా కఠిన చర్యలు తీసుకోవాలి. ఎవరికైనా కోవిడ్‌ లక్షణాలు కనిపిస్తే.. ఇంట్లో వారిని, ఇతర ప్రైమరీ కాంటాక్టులను విడిగా ఉంచి పరీక్షలు చేయించాలి. వ్యాక్సినేషన్‌ వేగం పెంచాలి. మార్కెట్లు, ఆఫీసులు వంటి చోట్ల పూర్తిగా భౌతికదూరం పాటించడం సాధ్యం కాకపోవచ్చు. కచ్చితంగా మాస్కులు ధరించడం, శానిటైజేషన్‌ పాటించేలా చూడాలి.
ప్రపంచవ్యాప్తంగా కొత్త వేరియంట్లను ఎదుర్కొనేలా కొత్త వ్యాక్సిన్లపై పరిశోధనలు జరుగుతున్నాయి. వాస్తవానికి వైరస్‌ ఉపరితలంపై ఉండే స్పైక్‌ ప్రోటీన్‌తో పోల్చితే.. అంతర్గతంగా ఉండే యాంటీ జెన్లు నెమ్మదిగా మ్యుటేట్‌ అవుతాయి. అందువల్ల స్పైక్‌ ప్రోటీన్‌తోపాటు యాంటీజెన్లపైనా పనిచేసేలా.. భిన్నమైన వేరియెంట్లను ఎదుర్కొనేలా కొత్త వ్యాక్సిన్లను రూపొందిస్తున్నారు. అమెరికాలో ఇలాంటి సూపర్‌ వ్యాక్సిన్‌కు సంబంధించి మార్చిలోనే ట్రయల్స్‌ మొదలయ్యాయి. దీనిపై తదుపరి దశల ట్రయల్స్‌ జరుగుతున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి సూపర్‌ వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇక శాస్త్రవేత్త కేథరిన్‌ జె వూ వెల్లడిస్తున్న వివరాల ప్రకారం.. మల్టీ యాంటీజెన్‌ వ్యాక్సిన్లను పరీక్షిస్తున్నారు. స్పైక్‌ ప్రోట్రీన్, న్యూక్లియో క్యాప్సిడ్, ఇంటీరియర్‌ వైరల్‌ యాంటీజెన్లతో కూడిన ‘ఓఆర్‌ఎఫ్‌–3ఏ’లను సమ్మిళితం చేసి ఆ వ్యాక్సిన్లు తయారు చేస్తున్నారు.

ఇంటర్వ్యూ: డాక్టర్‌ కె.శ్రీనాథ్‌రెడ్డి, పబ్లిక్‌ హెల్త్‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడు, ఎపిడమాలజిస్ట్‌ 

సాక్షి, హైదరాబాద్‌: కరోనా సెకండ్‌ వేవ్‌ ఇంకా ముగియలేదని.. వైరస్‌ తాకిడి మాత్రమే తగ్గిందని పబ్లిక్‌ హెల్త్‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడు, ఎపిడమాలజిస్ట్‌ డాక్టర్‌ కె.శ్రీనాథ్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రమాదం పక్కనే పొంచి ఉందనే విషయాన్ని మరిచిపోవద్దని, లాక్‌డౌన్‌ సడలింపును ఆసరాగా తీసుకుని ఇష్టమొచ్చినట్టు వ్యవహరించ వద్దని సూచించారు. పూర్తిగా సాధారణ పరిస్థితులు ఏర్పడేదాకా అన్ని జాగ్రత్తలు పాటించాలన్నారు. అన్ని వేరియంట్లపై పనిచేసే సూపర్‌ వ్యాక్సిన్‌పై ప్రయోగాలు జరుగుతున్నాయని, ఏడాది చివరినాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు. దేశంలో మూడో వేవ్‌ వస్తుందన్న అంచనాలు, కొత్తగా డెల్టా ప్లస్‌ కేసుల నమోదు, వ్యాక్సినేషన్‌ తీరు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై శ్రీనాథ్‌రెడ్డి ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. దీని ముఖ్యాంశాలు.. 

సాక్షి: డెల్టా ప్లస్‌ వేరియంట్‌ ఏ మేరకు ప్రమాదకరం? 
కె.శ్రీనాథ్‌రెడ్డి: డెల్టా ప్లస్‌ వేరియంట్‌కు సంబంధించి ఇంకా పూర్తిస్థాయి సమాచారం అందుబాటులో లేదు. మనదేశంలోనే కాదు పలు ఇతర దేశాల్లోనూ డెల్టా ప్లస్‌ కేసులొచ్చాయి. కొత్త వేరియంట్‌తో పెద్ద ప్రమాదం వస్తుందనేందుకు ప్రస్తుతం ఆధారాలేమీ లేవు. వ్యాప్తి ఎక్కువగా ఉండొచ్చన్న అంచనాలు మాత్రం ఉన్నాయి. ఈ వేరియంట్‌పై వ్యాక్సిన్‌ ప్రభావం ఎలా ఉంటుందన్నది తేలాల్సి ఉంది. గతేడాది వ్యాక్సిన్‌ లేకపోయినా లాక్‌డౌన్‌లు, కఠినమైన నిబంధనలు పాటించడం ద్వారా వైరస్‌ వ్యాప్తిని చాలా వరకు ఆపగలిగాం. రెండో వేవ్‌లో కొత్త వేరియంట్లు రావడం, జాగ్రత్తలు సరిగా పాటించకపోవడం వల్ల వైరస్‌ వ్యాప్తికి మనమే ఆస్కారం ఇచ్చాం. నిజానికి వైరస్‌లలో మార్పులు సహజం. అయితే కొత్త వేరియంట్‌గా మారినపుడు తీవ్రత (విరులెన్స్‌) పెరిగిందా, తగ్గిందా అనేది ముఖ్యం. సాధారణంగా వైరస్‌ ఇన్ఫెక్టివిటీ (వ్యాప్తి సామర్థ్యం)ని పెంచుకున్నప్పుడు విరులెన్స్‌ తగ్గు తుంది. ఎవల్యూషనరీ బయాలజీలో భాగంగానే ఇది జరుగుతుంది. అప్పటికే ఉన్న వ్యాక్సిన్లు కొత్త వేరియెంట్లపై కాస్త తక్కువ ప్రభావం చూపొచ్చు తప్ప.. వ్యాధి తీవ్రంగా మారకుండా ఉంటుంది. 

దేశంలో జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ పరిస్థితి ఏమిటి? 
మన దేశంలో వైరస్‌ శాంపిళ్ల జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ను మరింతగా పెంచాలి. యూకే వేరియంట్‌ వ్యాప్తితో జనవరిలో భారత్‌లో ఈ సీక్వెన్సింగ్‌ ప్రారంభించారు. కానీ రెండో వేవ్‌ రాదనే భ్రమలో జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ను భారీ స్థాయిలో చేపట్టేందుకు ఏర్పాట్లు చేయలేదు. మొత్తం శాంపిళ్లలో కనీసం 5 శాతమైనా సీక్వెన్సింగ్‌ చేయాలి. వైరస్‌ వేరియంట్లను గుర్తించి ఆయా చోట్ల నియంత్రణ చర్యలు చేపట్టాలి. కానీ ప్రస్తుతం అది జరగడం లేదు. 

పబ్లిక్‌ హెల్త్‌ సిస్టమ్‌ బలోపేతమెలా? 
కోవిడ్‌ నేపథ్యంలో దేశంలో వైద్య మౌలిక సదుపా యాలను పెంచుకోవాల్సి ఉంది. 2021–22 బడ్జెట్‌లో కేంద్రం, 15వ ఆర్థిక సంఘం నుంచి ప్రాథమిక వైద్య సదుపాయాల పెంపు, అత్యవసర సేవల కోసం నిధులు కేటాయించారు. ప్రభుత్వాలు పర్యవేక్షక వ్యవస్థను బలోపేతం చేసి.. కొత్త వైరస్‌లు, ఇతర సూక్ష్మజీవుల వ్యాప్తిపై నిఘా పెట్టాలి. కొత్త వైరస్‌లు, మైక్రోబ్‌లను గుర్తిస్తే.. వెంటనే పరిశోధన చేపట్టి, వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవచ్చు. ప్రస్తుతం రెండో వేవ్‌ తగ్గుముఖం పట్టినందున.. వెంటనే గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ప్రాథమిక వైద్య కేంద్రాలు, జిల్లా ఆస్పత్రుల బలోపేతానికి చర్యలు చేపట్టాలి. పర్యవేక్షక వ్యవస్థను పటిష్టపరచడం, అన్నిచోట్లా క్రిటికల్‌ కేర్‌ విభాగాల ఏర్పాటు మంచిది. వైద్య రంగానికి నిధుల కేటాయింపులు పెంచాలి. కేంద్రంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోనూ ఈ చర్యలు తీసుకోవాలి.  

ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి? 
కరోనా మహమ్మారి నుంచి రక్షణకు తప్పనిసరిగా వ్యాక్సిన్‌ వేసుకోవాలి. దానితోపాటు మాస్కులు, ఇతర జాగ్రత్తలు పాటించడం అనివార్యం. మాస్కులు ధరించకపోతే తమకే కాదు, ఇతరులకూ నష్టం చేసిన వారవుతారన్న విషయాన్ని గ్రహించాలి. పశ్చిమ దేశాల్లో మాస్కులు కచ్చితంగా పెట్టుకోవడం వల్ల.. కరోనాను తప్పించుకోవడంతోపాటు అక్కడ సీజనల్‌గా వచ్చే ఫ్లూ వ్యాధులు కూడా గణనీయంగా తగ్గినట్టు గుర్తించారు. 

వ్యాక్సిన్లు వేసుకుంటే బయటపడొచ్చా? 
దేశవ్యాప్తంగా కనీసం 50శాతంపైగా వ్యాక్సినేషన్‌ పూర్తయ్యే వరకు అప్రమత్తత అవసరం. జాగ్రత్తగా ఉండటమంటే పూర్తిగా తలుపులు మూసుకుని, ఇళ్లలోనే ఉండాలని కాదు. వారం వారం పోల్చి పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయా, సీరియస్‌ కేసులు ఎక్కువగా ఉంటున్నాయా, ఆస్పత్రులకు తాకిడి ఎక్కువగా ఉందా, మరణాల సంఖ్య ఎక్కువగా ఉంటోందా అన్న అంశాలను బట్టి కరోనా తీవ్రతను అంచనా వేయొచ్చు. కేసులు, సీరియస్‌ పేషెంట్ల సంఖ్య పెరిగితే మళ్లీ కఠిన నిబంధనలు అమలు చేయాల్సి వస్తుంది. 

కొత్త వేరియంట్లకు సంబంధించి ఏ అంశాలపై దృష్టి పెట్టాలి? 
కొత్త వేరియంట్ల వ్యాప్తి సామర్థ్యం(ఇన్ఫెక్టివిటీ), తీవ్రత ఎలా ఉంటుందో గమనించాలి. అవి ఇన్ఫెక్టివిటీ పెంచుకుంటే ఎక్కువ మందిని ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా జనం గుమిగూడితేనే వైరస్‌ వ్యాప్తికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. దక్షిణ కొరియాలో జనం గుమిగూడిన చోట్లనే మరో వేవ్‌ వచ్చింది. ఆస్ట్రేలియాలో కొత్తగా కేసులు నమోదైన సిడ్నీలోనూ ఎయిర్‌పోర్ట్‌కు టాక్సీ నడిపే డ్రైవర్లు వ్యాక్సిన్‌ తీసుకోకపోవడం, మాస్కులు సరిగా పెట్టుకోకపోవడం వల్ల విమాన ప్రయాణికుల నుంచి వైరస్‌ సోకింది. కేసులు పెరిగాయి. దాంతో సిడ్నీ న్యూసౌత్‌వేల్స్‌లో మళ్లీ లాక్‌డౌన్‌ పెట్టారు. ఇలాంటి ఘటనలతో మనవాళ్లకు జ్ఞానోదయం కలగాలి. కనీసం 50–60 శాతం దాకా వ్యాక్సినేషన్‌ పూర్తయ్యే దాకా జాగ్రత్తలు పాటించాలి. 

ఉన్నవేకాదు.. కొత్తగా పుట్టుకొచ్చే వాటికీ సూపర్‌ చెక్‌ 
సాధారణంగానే వైరస్‌లు తరచూ మ్యుటేషన్‌ చెంది కొత్త వేరియంట్లు ఏర్పడుతుంటాయి. అదే తరహాలో కరోనా వైరస్‌ చాలా మ్యూటేషన్లు చెందింది. ప్రస్తుతం డెల్టా, డెల్టా ప్లస్‌ వేరియంట్లు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అన్ని రకాల కరోనా వేరియంట్లపై పనిచేసే సూపర్‌ వ్యాక్సిన్‌ను.. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ నార్త్‌ కరోలినాకు చెందిన ‘గిల్లింగ్స్‌ స్కూల్‌ ఆఫ్‌ గ్లోబల్‌ పబ్లిక్‌ హెల్త్‌’శాస్త్రవేత్తలు రూపొందించారు. ఇప్పటికే ఈ వ్యాక్సిన్‌ను ప్రయోగశాలలో ఎలుకలు, ఇతర జంతువులపై పరిశీలించగా.. మంచి ఫలితాలు ఇస్తున్నట్టు గుర్తించారు. 

హైబ్రిడ్‌ ఆర్‌ఎన్‌ఏ టెక్నాలజీతో.. 
నార్త్‌ కరోలినా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు మొదట ఫైజర్, మొడెర్నా కంపెనీల తరహాలో ‘ఎంఆర్‌ఎన్‌ఏ’టెక్నాలజీతో వ్యాక్సిన్‌ రూపొందించాలని భావించారు. ఆ దిశగా ప్రయోగాలు మొదలుపెట్టారు. అయితే వైరస్‌ వేరియంట్లు మారినప్పుడు కూడా వ్యాక్సిన్‌ సమర్థవంతంగా పనిచేసేందుకు ఎక్కువ సంఖ్యలో కరోనా వేరియంట్ల ‘ఆర్‌ఎన్‌ఏ’లను తీసుకుని.. ‘హైబ్రిడ్‌ ఎంఆర్‌ఎన్‌ఏ’ఎన్‌కోడింగ్‌ను అభివృద్ధి చేశారు. దీనితో రూపొందించిన వ్యాక్సిన్‌ను ప్రయోగశాలలో ఎలుకలపై పరీక్షించారు. శరీరంలో రోగనిరోధక శక్తిని తప్పించుకునేలా మ్యూటేట్‌ అయిన దక్షిణాఫ్రికా బీటా రకం (బీ.1.351) కరోనాపైనా వ్యాక్సిన్‌ సమర్థవంతంగా పనిచేస్తోందని గుర్తించారు.

వేరియంట్లు మారినా.. 
ఇప్పుడున్న వేరియంట్లే కాదు భవిష్యత్తులో కొత్తగా పుట్టుకొచ్చే కరోనా వేరియంట్లను కూడా ఈ సూపర్‌ వ్యాక్సిన్‌ ఎదుర్కొంటుందని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త డేవిడ్‌ ఆర్‌ మార్టినెజ్‌ చెప్పారు. కరోనా స్పైక్‌ ప్రొటీన్‌తోపాటు అంతర్గతంగా ఉండే న్యూక్లియోటైడ్, యాంటీ జెన్‌లనూ ఈ వ్యాక్సిన్‌ టార్గెట్‌ చేస్తుందని వివరించారు. ఈ సూపర్‌ వ్యాక్సిన్‌పై త్వరలోనే హ్యూమన్‌ ట్రయల్స్‌ చేపడతామని తెలిపారు. తమ పరిశోధన ఆధారంగా భవిష్యత్తులో ‘సార్స్‌ కోవ్‌–3’వచ్చినా కూడా సులువుగా ఎదుర్కొనే అవకాశం ఉంటుందని వివరించారు. 
–సాక్షి సెంట్రల్‌ డెస్క్‌   

>
మరిన్ని వార్తలు