కూకట్‌పల్లి: మద్యం మత్తులో యువకుల హల్‌చల్‌..

5 Apr, 2021 08:08 IST|Sakshi

సాక్షి, కేపీహెచ్‌పీకాలనీ: మద్యం మత్తులో ఇద్దరు యువకులు హల్‌చల్‌ చేసిన ఘటన కేపీహెచ్‌పీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేపీహెచ్‌పీకాలనీలోని పెట్రోల్‌ బంక్‌ సమీపంలో ప్రధాన రహదారిపై సోడాలు అమ్ముకునే వ్యక్తి వద్దకు ఆదివారం రాత్రి ఇద్దరు యువకులు ఇన్నోవా వాహనంలో వచ్చారు. మద్యంలో కలుపుకొనేందుకు నీళ్లు ఇవ్వాలంటూ హంగామా సృష్టించారు. దీంతో సోడాలు అమ్ముకునే వ్యక్తి నీరు ఇచ్చేందుకు నిరాకరించాడు.

కోపోద్రిక్తులైన ఆ యువకులు సోడా బండిలోని సోడాలు, మంచినీటి డబ్బాను కింద పడేశారు. ఆ ఇద్దరు యువకుల్లో ఒకరు తాను పోలీస్‌ అధికారి కొడుకునంటూ ఇన్నోవా వాహనం సైరన్‌ మోగించి భయభ్రాంతులకు గురి చేయగా, సోడాలు అమ్మే వ్యక్తి 100కు డయల్‌ చేశారు. పోలీసులు ఘటన స్థలికి చేరుకుని అరుణ్, శ్రీనివాస్‌లను అదుపులోకి తీసుకున్నారు. శ్రీనివాస్‌ ఓ పోలీస్‌ అధికారి కుమారుడు కాగా, అరుణ్‌ డాక్టర్‌. వీరిద్దరిపై కేసు నమోదు చేశారు.  

చదవండి: పెళ్లి చూపుల కోసం కారు తీసుకెళ్లి..

మరిన్ని వార్తలు