-

సౌదీలో దుబ్బాక వాసి మృతి.. మమ్మీ నాన్న రాడా అంటూ.. 

9 Jun, 2022 08:27 IST|Sakshi
రోదిస్తున్న కుటుంబ సభ్యులు.. ఇన్‌సెట్‌లో మధు(ఫైల్‌) 

దుబ్బాకటౌన్‌ (మెదక్‌): సౌదీ అరేబియాలో బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో దుబ్బాక మండలం రాజక్కపేటకు చెందిన మొగుల్ల మధు(35) అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మధు ఉన్నత విద్య పీజీ, బీఈడీ చదివాడు. ఉద్యోగం కోసం ఎన్నో ప్రయత్నాలు చేసినా రాకపోవడం..  ఉన్న ఊళ్లో సైతం ఎలాంటి ఉపాధి లేకపోవడంతో గత్యంతరం లేక పని కోసం 2009లో గల్ఫ్‌ బాట పట్టాడు. 13 ఏళ్లుగా అక్కడ డీసీఎం డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. మూడు నెలల క్రితమే సౌదీ నుంచి సెలవులపై స్వదేశానికి వచ్చాడు.

కుటుంబ సభ్యులతో సరదాగా గడిపి వారం క్రితం(జూన్‌ 1న) మళ్లీ సౌదీకి తిరిగి వెళ్లి నాలుగు రోజుల క్రితమే డ్యూటీలో చేరాడు. ఈ క్రమంలో బుధవారం ఉదయం 8 గంటలకు తాను నడుపుతున్న డీసీఎంను మరో వాహనం ఢీ కొట్టడంతో జరిగిన ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందాడు.  ఈ విషయాన్ని సౌదీలో ఉంటున్న ఆయన పెద్దన్న నర్సింలు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.  మధుకు భార్య లావణ్యతో పాటు కొడుకు అశ్విత్‌(10), కూతరు వేదశ్రీ(2), వృద్ధులైన తల్లిదండ్రులు బాలయ్య, లక్ష్మి ఉన్నారు.

చదవండి: (మల్లేశంతో ప్రేమ వివాహం.. ఐదేళ్లయినా..)

మమ్మీ .. నాన్న రాడా  
మధు మృతిచెందాడన్న విషయం తెలియడంతో కుటింబీకులు, బంధువులు, గ్రామస్తులు రోదించడాన్ని చూస్తూ ఆయన పిల్లలు నాన్నకు ఏమైంది.. నాన్న ఇంటికి రాడా? అంటూ ఏం అర్థం గాక అమాయకత్వంతో బంధువులను అడుగడం అక్కడున్న వారిని తీవ్రంగా కలచివేసింది. తల్లి ఏడస్తుంటే నాన్న ఎప్పడోస్తడు మమ్మీ అంటూ అడగడంను చూసి ప్రతి ఒక్కరూ కన్నీరు పెట్టారు. 

శోక సంద్రమైన రాజక్కపేట 
అందరితో కలిసి మెలిసి ఉండే మధు.. సౌదీలో మృతిచెందడంతో రాజక్కపేటలో తీవ్ర విషాదం అలుముకుంది. ఉన్నత చదువులు చదివి ఉద్యోగం రాక గల్ప్‌ పోయిండు. వారం క్రితమే పోతున్నా అంటూ అందరినీ కలిసి చెప్పి పోయిండు ఇంతలోనే ఈఘోరం  జరిగిందంటూ అతని స్నేహితులు, గ్రామస్తులు కన్నీరుమున్నీరయ్యారు.

చదవండి: (నిశ్చితార్థం జరిగినా.. వీడియోలతో భయపెడుతూ పలుమార్లు అత్యాచారం)

మరిన్ని వార్తలు