HYD: 30 టీమ్స్‌తో స్పీడ్‌ పెంచిన ఈడీ.. తెలంగాణలో అరెస్ట్‌లు?

9 Nov, 2022 10:44 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) దూకుడు పెంచింది. పలుచోట్ల మరోసారి ఈడీ అధికారులు సోదాలు నిర్వహించేందుకు బయలుదేరారు. బుధవారం ఉదయం నుంచే కేంద్ర బలగాలు పెద్ద సంఖ్యలో నగరంలోని ఈడీ కార్యాలయానికి చేరుకున్నాయి. కరీంనగర్‌, హైదరాబాద్‌లో ఈడీ సోదాలు నిర్వహించేందుకు బయలుదేరాయి. 

కాగా, బుధవారం తెల్లవారుజామున 6 గంటల ప్రాంతంలో దాదాపు 30 బృందాలు, 10 వాహనాల్లో సోదాలు నిర్వహించేందుకు ఈడీ కార్యాలయం నుంచి అధికారులు బయలుదేరాయి. వాటిలో కొన్ని బృందాలు కరీంనగర్‌వైపు వెళ్లగా.. మరికొన్ని బృందాలు హైదరాబాద్‌లో సోదాలు నిర్వహిస్తున్నాయి. మరోవైపు.. కేంద్ర బలగాల్లో మహిళా అధికారులు కూడా ఉన్నారు. కాగా, కొద్దిరోజుల పాటు ఈ సోదాలు కొనసాగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. ఈడీ అధికారులతోపాటు ఐటీ అధికారులు కూడా సోదాలకు వెళ్లడం ఆసక్తికరంగా మారింది.

సోమాజీగూడ, అత్తాపూర్‌లో గ్రానైట్‌ వ్యాపారుల ఇళ్లలో, కరీంనగర్‌లోని గ్రానైట్‌ వ్యాపారుల ఇళ్లు, ఆఫీసులే లక్ష్యంగా ఈడీ, ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. క్వారీ నిర్వాహకులు ఫెమా నిబంధనలు ఉల్లంఘించారని ఫిర్యాదు వచ్చిన నేపథ్యంలో సోదాలు నిర్వహిస్తున్నట్టు సమాచారం. ఇక, గతంలో 8 ఏజెన్సీలకు ఈడీ నోటీసులు ఇచ్చింది. తక్కువ పరిమాణం చూపి విదేశాలకు ఎక్కువ ఎగుమతులపై ఈడీ ఆరా తీస్తోంది.

మరిన్ని వార్తలు