కవిత లేఖపై స్పందించిన ఈడీ.. 

9 Mar, 2023 07:54 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసు దేశవ్యాప్తంగా పొలిటికల్‌గా పెను ప్రకంపనలు సృష్టించింది. తాజాగా ఈడీ.. ఎమ్మెల్సీ కవితకు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాను 11వ తేదీన విచారణకు హాజరు కానున్నట్టు ఈడీని కోరుతూ బుధవారం లేఖ రాశారు. 

అయితే, కవిత లేఖపై ఈడీ.. గురువారం ఉదయం స్పందించింది. కవిత విజ్ఞప్తి మేరకు ఈడీ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. 11వతేదీన(శనివారం) విచారణకు హాజరు కావాలని తెలిపింది. దీంతో, ఈడీ విచారణపై ఉత్కంఠకు తెరపడింది. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న ఎమ్మెల్సీ కవిత.. గురువారం మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రెస్‌మీట్‌లో మాట్లాడనున్నారు. 

బీఆర్‌ఎస్‌ పార్టీ ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డి నివాసంలో విలేకరులు సమావేశం జరుగనుంది. ఇక, శనివారం ఈడీ ఎదుట విచారణకు హాజరు కానున్న నేపథ్యంలో కవిత మాససికంగా సిద్దమవుతున్నట్టు తెలుస్తోంది. కాగా, లిక్కర్‌ స్కాం కేసులో​ భాగంగా అరుణ్ రామచంద్ర పిళ్లై, బుచ్చిబాబులతో కలిపి కవితను ఈడీ అధికారులు విచారించనున్నారు. మరోవైపు.. కవితను ముందస్తు బెయిల్‌ కోసం బీఆర్‌ఎస్‌ లీగల్‌ సెల్‌ ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. 

కాగా, రేపు(శుక్రవారం) జంతర్‌ మంతర్‌లో కవిత ధర్నాలో పాల్గొననున్న విషయం తెలిసిందే. ఈ ధర్నా కోసం 16 పార్టీలు, 29 సంఘాల నేతలకు ఆహ్వానం అందించారు. బీఆర్‌ఎస్‌, నేషనల్‌ కాన్ఫరెన్స్‌, పీడీపీ, అకాలీదళ్‌, టీఎంసీ, జేడీయూ, ఆర్జేడీ, సమాజ్‌వాదీ పార్టీ, సీపీఐ, సీపీఎం, డీఎంకే, ఎన్సీపీ, శివసేన, ఆప్‌, ఆర్‌ఎల్డీ, జేఎమ్‌ఎమ్‌ పార్టీల ప్రతినిధులు హాజరవుతారని కవిత ఆఫీసు వర్గాలు తెలిపాయి. 

మరిన్ని వార్తలు