బీసీలంటే వెనక్కు నెట్టివేయబడిన వాళ్లు

11 May, 2023 03:33 IST|Sakshi

తెలంగాణకు ముందంతా ఇక్కడ అలానే జరిగింది

కానీ కేసీఆర్‌ హయాంలో బీసీల సమగ్ర అభివృద్ధికి కృషి 

సభలో మంత్రి గంగుల కమలాకర్‌ వ్యాఖ్యలు 

టీటీసీఎఫ్‌సీ చైర్మన్‌గా పల్లె రవికుమార్‌ బాధ్యతల స్వీకరణ 

సాక్షి, హైదరాబాద్‌/నాంపల్లి: బీసీలంటే వెనుకబడిన వాళ్లు కాదని, వెనక్కు నెట్టివేయబడిన వారని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ వ్యాఖ్యానించారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు రాష్ట్రంలోని బీసీల బతుకులన్నీ వెనక్కు నెట్టివేయబడ్డాయని, కేసీఆర్‌ సారథ్యంలో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత బీసీల సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతున్నట్లు వివరించారు.

సీనియర్‌ జర్నలిస్టు పల్లె రవికుమార్‌ గౌడ్‌ తెలంగాణ రాష్ట్ర కల్లు గీత పారిశ్రామిక సహకార సంస్థ తొలి చైర్మన్‌గా బుధవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కల్యాణలక్ష్మి, రైతుబంధులాంటి పథకాలతో అత్యధికంగా లబ్ధి పొందుతున్నది బీసీలేనన్నారు. మంత్రి జగదీశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ స్పూర్తితో మేధావులు, కవులు, కళాకారులు, జర్నలిస్టులు తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వామ్యం కావాలన్నారు.

సీఎం అప్పగించిన బాధ్యతను నిజాయితీగా నిర్వర్తిస్తా 
తనకు ఈ అవకాశం క ల్పించిన సీఎం కేసీఆర్‌కు, సహకరించిన మంత్రులు కేటీఆర్, వి.శ్రీనివాస్‌ గౌడ్‌కు పల్లె రవికుమార్‌ గౌడ్‌ కృతజ్ఞతలు తెలిపారు. సీఎం తనకు అప్పగించిన బాధ్యతను కర్తవ్యాన్ని చిత్తశుద్ధి, నిజాయితీ, నిబద్ధతతో నిర్వహిస్తానని చెప్పారు.  కార్యక్రమంలో రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్యేలు గ్యాదరి కిషోర్, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ మల్లేశం  పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు