గుడ్డు @ 6

22 Sep, 2020 03:58 IST|Sakshi


సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో కోడిగుడ్డు ధర కొండెక్కింది. మార్కెట్లో ఒక్కో కోడిగుడ్డు ధర ఏకంగా రూ. 6కు ఎగబాకి ఆల్‌టైమ్‌ రికార్డు సృష్టిస్తోంది. కరోనా లాక్‌డౌన్‌ ముందు వరకు రూ. 4 నుంచి రూ. 4:50 వరకు పలికిన ధర గత కొన్ని రోజు లుగా రూ. 5 పలుకుతోంది. తాజాగా రూ. 6కు పెరిగింది. 2017 సెప్టెం బర్‌లో అత్యధికంగా రూ. 5.35 ధర పల కగా ఇప్పుడు దాన్ని మించి ధర నమోదు కావడం గమనార్హం. కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో అత్యధిక విక్రయాల్లో ముందు వరుసలో ఉన్నది కోడిగుడ్డే. రోగ నిరోధకశక్తిని పెంచు కొనే క్రమంలో రోజుకొక కోడిగుడ్డు తినాలని వైద్యులు సూచిస్తుండటంతో గుడ్ల వినియోగం గణనీయంగా పెరిగింది. అదే సమయంలో నిర్వహణ, రవాణా ఖర్చులు పెరగడంతో ఉత్పత్తి తగ్గింది. దీంతో కోడిగుడ్డు ధర పెరిగిందని పౌల్ట్రీ రైతులు చెబుతున్నారు.

డిమాండ్‌ పెరిగి... ఉత్పత్తి తగ్గి...
దక్షిణాధి రాష్ట్రాల్లో పౌల్ట్రీ పరిశ్రమకు తెలంగాణ కేంద్రంగా ఉంది. రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే కోడిగుడ్లు, లైవ్‌ బర్డ్స్‌లో సగం ఇతర రాష్ట్రాలకే ఎగుమతి అవుతుంటాయి. అయితే కరోనా లాక్‌డౌన్, ఆ తర్వాతి పరిస్థితుల వల్ల ఆర్థికంగా నష్టపోయిన పౌల్ట్రీ రైతులు కొంతకాలం వరకు కొత్తగా బర్డ్స్‌ వేయొద్దని నిర్ణయం తీసుకున్నారు. దీంతో కోడిగుడ్ల ఉత్పత్తి తగ్గింది. రాష్ట్రంలో రోజుకు సగటున 3.65 కోట్ల గుడ్లు ఉత్పత్తి అయ్యేవి. ప్రస్తుతం ఈ సంఖ్య 2.80 కోట్లకు తగ్గింది. ప్రస్తుతం ఉత్పత్తి అవుతున్న గుడ్లలోనూ సగం పొరుగు రాష్ట్రలకు ఎగుమతి అవుతుండటంతో రాష్ట్రంలో నిత్యం 1.4 కోట్ల కోడిగుడ్లు మాత్రమే అందుబాటులో ఉంటున్నాయి. అదే సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకొనేందుకు కోడిగుడ్లను తినాలన్న వైద్యుల సూచనతో గుడ్ల వినియోగం రోజుకు 1.3 కోట్ల నుంచి 2 కోట్లకు పెరిగింది. ఈ క్రమంలో డిమాండ్‌కు తగిన ఉత్పత్తి లేక ధరలు పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. కోళ్ల ఆహారానికి సంబంధించిన ముడిసరుకు, రవాణా చార్జీలు పెరగడం కూడా ధరల పెరుగుదలకు కారణమైనట్లు వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.

చిన్నారులకు బంద్‌...
కోడిగుడ్డు ధర ఒక్కసారిగా పెరగడంతో ఆ ప్రభావం అంగన్‌వాడీ కేంద్రాలపై పడింది. అంగన్‌వాడీ కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకున్న చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు మధ్యాహ్న భోజనంలో ప్రతిరోజూ ఒక గుడ్డును ఇస్తుంటారు. ఇందుకోసం ఏటా టెండర్ల పద్ధతిలో డీలర్లను ఎంపిక చేసి రోజుకు సగటున 8 లక్షల కోడిగుడ్లు సరఫరా చేస్తుంటారు. ప్రస్తుతం ధరలు పెరగడంతో తమకు గిట్టుబాటు కావట్లేదనే సాకుతో డీలర్లు 10 రోజులుగా పంపిణీని నిలిపివేశారు. దీంతో అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులకు గుడ్లను అందించలేకపోతున్నారు.  

మరిన్ని వార్తలు