తెలంగాణలో లాక్‌డౌన్‌ అమలు విఫలం

19 May, 2021 18:48 IST|Sakshi

హైదరాబాద్: తెలంగాణలో లాక్‌డౌన్‌ అమలు తీరు పట్ల విమర్శలు వెల్లువేత్తతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ లో సడలింపుల సమయం 10 గంటల తర్వాత కూడా ప్రజలు యథేచ్చగా రోడ్లపైకి గుంపులు గుంపులుగా వస్తున్నారు. పోలీసు శాఖ విచ్చలవిడిగా పాసులు జారీ చేయడమే దీనికి ప్రధాన కారణం, సాధారణ రోజుల్లాగానే రోడ్లపైకి జనం వస్తున్నారు. తెలంగాణలో లాక్‌డౌన్‌ అమలులో పోలీసు శాఖ విఫలమైంది అని ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేసింది. దీంతో వెంటనే డీజీపీ వెంటనే సమావేశం నిర్వహించి జోనల్‌ ఐజీలు, డీఐజీలు, కమిషనర్లు, ఎస్పీలకు డీజీపీ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 30వ తేదీ వరకు లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేయాలని అధికారులకు ఆదేశించారు.  

మే 30వ తేదీ అనంతరం తిరిగి లాక్‌డౌన్ ను పొడగించేందుకు వీలులేకుండా ప్రస్తుత లాక్‌డౌన్ ను మరింత కఠినంగా అమలు చేయాలని తెలిపారు. ఉదయం 6గంటల నుంచి 10 గంటల వరకు లాక్‌డౌన్ సడలింపు ఉన్నప్పటికీ 8 గంటల తర్వాతే ప్రజలు నిత్యావసరాలకై వస్తున్నందున మార్కెట్లు, దుకాణాల వద్ద పెద్ద ఎత్తున ప్రజలు గుమికూడటం కనిపిస్తుందని, దీనిని నివారించేందుకు ఉదయం 6 గంటల నుండే తమ అవసరాలకై వెళ్లే విధంగా ప్రజలను చైతన్య పర్చాలని సూచించారు. 10 గంటల అనంతరం వీధుల్లో పెద్ద ఎత్తున జనసంచారం ఉంటుందని, దీనిని నివారించేందుకై సరైననా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు.  

కరోనా వ్యాప్తికి అవకాశాలు ఉన్న ఫిష్ మార్కెట్లు, వెజిటేబుల్ మార్కెట్లలో జన సామర్థ్యాన్ని తగ్గిచేందుకు మార్కెటింగ్, మున్సిపల్, సంబంధిత శాఖల సమన్వయంతో ఆయా మార్కెట్లను వికేంద్రించే విధంగా చర్యలు చేపట్టాలని తెలియజేశారు. ఉదయం 10 గంటల అనంతరం అనుమతిలేని వాహనాలు సంచరిస్తే వాటిని వెంటనే తాత్కాలికంగా సీజ్ చేయాలని అన్నారు. కేవలం ప్రధాన రహదారుల్లోనే లాక్‌డౌన్ అమలు చేయడమే కాకుండా కాలనీలు, అంతర్గత రహదారుల్లోనూ కఠినంగా అమలు చేయాలని పేర్కొన్నారు. లాక్‌డౌన్‌ నిబందనలు ఉల్లంఘిస్తే కేసులు పెట్టాలని సూచించారు.

లాక్‌డౌన్ సమయం ముగియగానే ఉదయం 10 గంటలకు అన్ని పెట్రోలింగ్ వాహనాలు సైరన్ వేసి సంచరించాలని తెలిపారు. లాక్‌డౌన్ అమలుపై సామన్య ప్రజానికం నుండి సహాయ సహకారాలు అందుతున్నాయని, ఈ విషయంలో పోలీసు శాఖపై ఏవిధమైన ఫిర్యాదులు అందడంలేదని అన్నారు. రాష్ట్రంలో పెట్రోల్ బంక్ లను పూర్తిస్థాయిలో తెరిచేందుకు ప్రభుత్వం అనుమతులు జారీచేసిందని, అయితే లాక్‌డౌన్ అనంతరం కేవలం అనుమతించిన వాహనాలు, అంబులెన్స్ లు, ఆక్సిజన్ రవాణా లాంటి వాహనాలు మాత్రమే పెట్రోల్ బంకులకు అనుమతించాలని స్పష్టం చేశారు.

చదవండి:

లాక్‌డౌన్ నుంచి వీటికి మినహాయింపు

మరిన్ని వార్తలు