రేపు నేను కూడా వ్యాక్సిన్‌ వేయించుకుంటా: ఈటల

15 Jan, 2021 17:58 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కరోనా వైరస్‌ వ్యాక్సిన్ వేసుకోవడానికి బలవంతం ఏమీ లేదని, సంసిద్ధంగా ఉన్నవారికే వ్యాక్సిన్ వేస్తామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. తాను కూడా శనివారం గాంధీలో వ్యాక్సిన్ వేయించుకుంటానని అన్నారు. గాంధీ ఆస్పత్రిలో రేపటి వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమంలో మంత్రి ఈటలతో పాటు సీఎస్ సోమేశ్‌కుమార్‌, హెల్త్ సెక్రటరీ రిజ్వీ పాల్గొంటారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఈటల మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ రేపు మొదటి డోసు‌.. 28 రోజుల తర్వాత రెండో డోసు ఇస్తారు. మొదటి డోసు ఏ కంపెనీది ఇచ్చారో.. రెండో డోసు కూడా అదే కంపెనీది ఇస్తారు. ప్రైవేటు ఆస్పత్రిలో వైద్య సిబ్బందికి కూడా కరోనా వ్యాక్సిన్ ఇస్తాం

10 వేల మంది సిబ్బందికి కోవిడ్ వ్యాక్సిన్‌పై శిక్షణ ఇప్పించాం. వ్యాక్సిన్‌పై ప్రజల్లో ఆందోళన, అపోహలు ఉన్నాయి. వ్యాక్సిన్‌కి శాస్త్ర బద్దంగా అనుమతులు ఇచ్చారు. వాటి పరిశోధన, తయారీకి వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. వ్యాక్సిన్‌పై ఎలాంటి అనుమానాలు అవసరం లేదు. నిరంతరంగా వ్యాక్సిన్ ప్రక్రియ కొనసాగుతుంది. వ్యాక్సినేషన్‌కు సంబంధించి సీఎం కేసీఆర్ పలు సూచనలు చేశారు. వ్యాక్సిన్ వేసిన తర్వాత వారికి ఆస్పత్రిలో సదుపాయాలు కల్పించాలని సీఎం సూచించారు. అందరికీ వ్యాక్సిన్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశాం’’ అని ఈటల పేర్కొన్నారు.
( కూతురు సమస్యను వెంటనే తీర్చారు.. కానీ )

మరిన్ని వార్తలు