అలా చేయకపోతే కాలగర్భంలో కలిసిపోతాం!

21 Sep, 2020 20:17 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : వైద్య ఆరోగ్య శాఖ సంస్కరణలకు సిద్ధం కావాలని, కాలానుగుణంగా మార్పులు చేయకపోతే కాలగర్భంలో కలిసిపోతామని ఆ శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ వ్యాఖ్యానించారు. క్వాలిఫైడ్ డాక్టర్స్ అయ్యాక మీ సేవలు ప్రజలకు అందకపోతే కష్టపడి చదువుకుని ఏం లాభమని ప్రశ్నించారు. ప్రభుత్వ యంత్రాంగంలో పని చేస్తున్న డాక్టర్, నర్సు, పారామెడికల్ సిబ్బంది డ్యూటీ ఓరియంటెడ్‌గా, పీపుల్ ఓరియంటెడ్‌గా, కమిట్‌మెంట్‌తో పని చేయాలన్నారు. సోమవారం జరిగిన వైద్య ఆరోగ్యశాఖ సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..  ‘‘నూతన వైద్య విధానాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు శిక్షణ ఇవ్వాలి. ఫ్లోరైడ్, మలేరియా, బోదకాలు, లాంటి జబ్బులు ఏ ప్రాంతాల్లో ఎక్కువగా వస్తున్నాయో 'డిసీజ్ మాపింగ్' చేయాలి. దానికి అనుగుణంగా ఆయా ఆసుపత్రుల్లో డాక్టర్స్, మందులు ఉండేలా చూడాలి. 

మందులు - ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల నుంచి టర్శరే కేర్ ఆసుపత్రుల వరకు.. అన్ని చోట్లా అందుబాటులో ఉన్న మందులు ఎన్ని.. అవి ఎప్పుడు ఎక్స్పైర్ అవుతాయి అనే వివరాలు కంప్యూటరీకరణ చెయ్యాలి. ప్రతి మందుకు లెక్క ఉండాలి. పీహెచ్‌సీలో అనవసర మందులు ఉంచవద్దు. దీని కోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్ తయారు చేయాలి. వైద్య చరిత్రలో మొదటి సారి గడువు ముగిసిన మందులను కంపెనీలకు తిప్పి పంపించి డబ్బులు వెనక్కి తీసుకున్నాము. ప్రపంచంలో ఉన్న మంచి వైద్య విధానాలను తెలుసుకొని మన దగ్గర అమలు చేయాలి. మంచి హెల్త్ కేర్ సిస్టమ్‌లు ఏమున్నాయి, వాటిని మన దగ్గర అమలు చేయడానికి ఉన్న ప్రతిబంధకాలు ఏంటి, వాటిని ఏవిధంగా అధిగమించాలి అనే సమగ్ర కార్యాచరణ రూపొందించాలి. మన నెట్ వర్క్ ప్రైవేట్ హాస్పిటల్స్ కంటే పెద్దది. కాబట్టి రెఫరల్ సిస్టమ్‌ను మొదలు పెట్టండి. ఆశా వర్కర్స్ పేషంట్లను పెద్దాసుపత్రులకు పంపించే విధానం అమలు కావాలి. ( మంత్రి ఈటల పేషీలో ఏడుగురికి కరోనా )

బాధ్యత పెరగాలి - మార్పు రావాలి. ప్రతి హాస్పిటల్లో రిసెప్షన్ ఉండాలి. వారు పేషంట్లను గైడ్ చేసే విధంగా ఉండాలి. ప్రతి పేషంట్ ఆరోగ్య పరిస్థితి అతనికి, అతని బంధువులకు ఎప్పటికప్పుడు అందజేయాలి. ప్రతి ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో, ఆసుపత్రిలో ఏం జరుగుతుందో హైదరాబాద్‌లో కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఉండి చూడగలిగే విధంగా చేయాలి. చిన్న చిన్న పథకాలు పెద్ద మార్పు తీసుకు వస్తాయి. కేసీఆర్‌ కిట్ పథకం వల్ల 50 శాతం డెలివరీలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరుగుతున్నాయి. కళ్యాణ లక్ష్మి పథకం వల్ల చిన్న వయసులో పెళ్లిళ్లు, చిన్నవయసులో గర్భాలు, నెలలు తక్కువగా పిల్లలు పుట్టడం ఆగిపోయాయి. 18 సంవత్సరాలు నిండితేనే కళ్యాణ లక్ష్మి పథకం అమలు అవుతుంది. కాబట్టి ఇవ్వన్నీ ఆగి పోయాయి. ఆరోగ్యవంతమైన సమాజం లేకుండా ప్రపంచంతో పోటీ పడలేము. చిన్న చిన్న మార్పులు, చేర్పులతో ఒక సంవత్సర కాలంలో వైద్య ఆరోగ్య శాఖలో గొప్ప మార్పులు వస్తాయని ఆశిస్తున్నా’’ అని అన్నారు.

మరిన్ని వార్తలు