హైదరాబాద్: గతంలో కరోనా కన్నా భయంకరమైన వైరస్లు ఎన్నో వచ్చాయి కానీ.. ఇంత నష్టం జరగలేదన్నారు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్. కరోనాపై మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు ఎవరూ కరోనాకు భయపడొద్దని సూచించారు. గతంలో కరోనా కంటే భయంకరమైన వైరస్లు వచ్చాయని తెలిపారు. వైరస్ లక్షణాలున్నవారికి టెస్టులు చేయాలని స్పష్టం చేశారు. పీహెచ్సీ స్థాయిలోనే కరోనా నియంత్రణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. అన్ని జిల్లాల వైద్య అధికారులతో రివ్యూ నిర్వహించామన్నారు. (ప్రజల వద్దకే పరీక్షలు)
జలుబు, దగ్గు, జ్వరం లాంటి లక్షణాలుంటే వెంటనే ఆస్పత్రులకు వెళ్లాలని ఈటల కోరారు. కరోనా చికిత్సపై గ్రామీణ వైద్యులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు ఈటల. గతంలోలాగా ప్రైవేట్ ఆస్పత్రులు కరోనా వైద్యాన్ని కూడా వ్యాపారంగా భావించొద్దని కోరారు. అధికంగా వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు ఈటల రాజేందర్.