సాక్షి, మెదక్: మెదక్ జిల్లా కేంద్రంలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసనలో అపశ్రుతి చోటు చేసుకుంది. ఎడ్ల బండిపై నుంచి ప్రసంగిస్తుండగా మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ జారీ కింద పడ్డారు. ఈ ఘటనలో ఆయన కాలికి స్వల్ప గాయం అయ్యింది.
పెట్రో ధరల పెంపుపై తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ నిరసన కార్యక్రమాలు చేపట్టిన సంగతి తెలిసిందే. స్థానిక నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు నిరసనల్లో పాల్గొన్నారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపును వ్యతిరేకిస్తూ ధర్నాచౌక్లో సైకిల్ ర్యాలీ, ఎడ్లబండితో నిరసన తెలిపారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్, గీతా రెడ్డి, మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, ఫిరోజ్ ఖాన్తో పాటు పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు.