Electric Scooter: బీడీల కంపెనీ ఎదుట నిలిపి ఉంచిన ఎలక్ట్రిక్‌ స్కూటీ ఒక్కసారిగా...

31 Aug, 2022 03:31 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

దుబ్బాక: లంగర్‌ బీడీ కంపెనీ ఎదుట పార్కింగ్‌ చేసిన ఎలక్ట్రిక్‌ స్కూటీ బ్యాటరీలో పేలుడు సంభవించి మంటల్లో కాలిపోయింది. ఈ ఘటన దుబ్బాక మున్సిపల్‌ పరిధిలోని లచ్చపేట 10వ వార్డులో మంగళవారం చోటుచేసుకుంది. దుబ్బాక మండలం రామక్కపేట గ్రామానికి చెందిన దోర్నాల హరిబాబు బీడీ కంపెనీ టేకేదార్‌గా పని చేస్తున్నాడు. ఏడాది కిందట పట్టణంలోని ఓ వాహన షోరూం నుంచి ఎలక్ట్రిక్‌ స్కూటీని కొనుగోలు చేశాడు.

ప్రతీరోజు బీడీల గంపను స్కూటీపై పెట్టుకొని రామక్కపేట నుంచి లచ్చపేట లంగర్‌ బీడీ కంపెనీకి తీసుకెళ్తుంటాడు. ఈ క్రమంలో మంగళవారం స్కూటీని కంపెనీ ఎదుట నిలిపి ఉంచగా, స్కూటీ బ్యాటరీ పేలి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో స్కూటీ పూర్తిగా దగ్ధమ వడంతోపాటు పక్కనే నిలిపి ఉన్న సైకిల్‌ పాక్షికంగా కాలిపోయింది. స్థానికులు అప్రమత్తమై నీళ్లు చల్లి మంటలను అదుపు చేయడంతో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఎలక్ట్రిక్‌ కంపెనీ ప్రతినిధులు ఘటనా స్థలానికి చేరుకుని వాహనాన్ని అక్కడి నుంచి తరలించారు.

మరిన్ని వార్తలు