ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు మెట్రో..

28 Nov, 2022 09:01 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌కు తలమానికమైన శంషాబాద్‌ విమానాశ్రయానికి మెట్రో రైలు పరుగులు పెట్టేందుకు రంగం సిద్ధమైంది. రాయదుర్గం మైండ్‌స్పేస్‌ జంక్షన్‌ నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు వరకు మెట్రో మార్గం ఏర్పాటుకు ముహూర్తం ఖరారైంది. డిసెంబర్‌ 9న సీఎం కేసీఆర్‌ ఈ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు వివరాలను మున్సిపల్, ఐటీశాఖల మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌లో ట్వీట్‌ చేశారు.

సుమారు 31 కిలోమీటర్ల నిడివి ఉండే ఈ మార్గాన్ని పూర్తి చేసేందుకు సుమారు రూ.6,250 కోట్లు వ్యయం అవుతుందని తెలిపారు.  రాయదుర్గం–ఎయిర్‌పోర్టు మెట్రో రైలు ఏర్పాటైతే ఐటీ కారిడార్‌ నుంచి విమానాశ్రయానికి చేరుకునేవారికి దూరాభారం, సమయం తగ్గుతాయి. ప్రస్తుతం రాయదుర్గం నుంచి శంషాబాద్‌ విమానాశ్రయానికి రోడ్డు మార్గంలో చేరుకునేందుకు సుమారు 50 నిమిషాల సమయం పడుతోంది. మెట్రో రైళ్లలో 25 నిమిషాల్లో చేరుకునేందుకు వీలుగా ఎక్స్‌ప్రెస్‌ మెట్రో కారిడార్‌ను ఏర్పాటు చేసే ప్రతిపాదనలు ఉన్నాయి. ఇప్పటికే ఈ మార్గానికి సంబంధించి  ఢిల్లీ మెట్రోరైల్‌ కార్పొరేషన్‌ అధికారులు సమగ్ర ప్రాజెక్టు నివేదిక సిద్ధం చేశారు. ఈ ప్రాజెక్టు కోసం హైదరాబాద్‌ మెట్రో రైల్‌ లిమిటెడ్, హెచ్‌ఎండీఏల ఆధ్వర్యంలో ప్రత్యేకంగా స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌ (ఎస్పీవీ)ను కూడా గతంలోనే ఏర్పాటు చేశారు. 

మెట్రో రెండోదశపై చిగురిస్తున్న ఆశలు 
మంత్రి కేటీఆర్‌ ప్రకటనతో హైదరాబాద్‌ నగరంలో మెట్రోరైలు రెండో దశ విస్తరణపై ఆశలు చిగురిస్తున్నాయి. రెండో దశ కింద రాయదుర్గం–శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం (31 కి.మీ.)తోపాటు బీహెచ్‌ఈఎల్‌–లక్డీకాపూల్‌ (26 కి.మీ), నాగోల్‌–ఎల్బీనగర్‌ (5 కి.మీ) మార్గాల్లో మెట్రో ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల సమగ్ర ప్రాజెక్టు నివేదికను సిద్ధంచేసి కేంద్ర ప్రభుత్వానికి సమరి్పంచింది. రెండోదశకు అవసరమైన రూ.8,500 కోట్ల నిధులు కేటాయించాలని కోరుతూ మంత్రి కేటీఆర్‌ ఇటీవలే కేంద్ర పట్టణాభివృద్ధి శాఖకు లేఖ రాశారు. సంబంధిత అధికారులతో సంప్రదింపులు కూడా జరుపుతున్నారు. 

ప్రతీ 5 కిలోమీటర్లకు ఓ స్టేషన్‌
విమానాశ్రయ మార్గంలో ప్రతీ ఐదు కిలోమీటర్లకు ఓ మెట్రోస్టేషన్‌ను ఏర్పాటుచేయనున్నట్టు తెలిసింది. స్టేషన్లకు అనుసంధానంగా రవాణా ఆధారిత ప్రాజెక్టులను అభివృద్ధి చేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఔటర్‌ రింగ్‌ రోడ్డుకు సమీపంలోని గచి్చ»ౌలి, అప్పా జంక్షన్, కిస్మత్‌పూర్, గండిగూడ చౌరస్తా, శంషాబాద్‌ విమానాశ్రయం తదితర ప్రాంతాల్లో స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు స్థలపరిశీలన కూడా పూర్తయింది. పిల్లర్ల ఏర్పాటుకు వీలుగా సాయిల్‌ టెస్ట్‌ చేస్తున్నట్టు మెట్రో వర్గాలు తెలిపాయి.  

మరిన్ని వార్తలు