ఈ అగ్నిప్రమాదం గచ్చిబౌలిలో జరిగిందా?

18 Jan, 2021 11:30 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నిజం గడప దాటేలోపు అబద్ధం ఊరు దాటుతుందంటారు. కానీ సోషల్‌ మీడియా పుణ్యాన ఊరేంటి, ఏకంగా ప్రపంచాన్నే చుట్టేస్తోంది. తాజాగా నెట్టింట మరో ఫేక్‌ వార్త హైదరాబాదీయులను ఆగమాగం చేసింది. గచ్చిబౌలి ఫ్లైఓవర్‌ మీద నుంచి వెళ్తున్న ఓ ఆయిల్‌ ట్యాంకర్‌కు నిప్పంటుకుని పేలిందన్న వార్త తెగ వైరల్‌ అవుతోంది. దీనికి సంబంధించిన ఫొటోలు జనాలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ట్యాంకర్‌ ఆనవాళ్లు లేకుండా అగ్నికి ఆహుతవగా దాని పొగలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ ప్రమాదం నిజంగానే జరిగింది. కానీ భాగ్యనగరంలో కాదు. పుణెలో! (చదవండి: పాతిపెట్టిన పిల్లిని తీసి కూర వండేసింది!)

ఓ నెల క్రితం పుణెలోని వార్జే బ్రిడ్జి మీద ఆహారపదార్థాలను మోసుకువెళ్తున్న సాధారణ ట్రక్కు నుంచి హఠాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో అందులో ఉన్న డ్రైవరు వాహనంలో నుంచి బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్నాడు. డిసెంబర్‌ 5న జరిగిన ఈ ఘటన తాజాగా హైదరాబాద్‌లో జరిగిందంటూ లేనిపోని పుకార్లు సృష్టిస్తున్నారు. సైబరాబాద్‌ పోలీసులు సైతం దీనిపై స్పందించి ఇది మనదగ్గర జరగలేదని ఇదివరకే క్లారిటీ ఇచ్చారు. ఈ మధ్య కాలంలో ఇలాంటి ఘటనలు నగరంలో చోటు చేసుకోలేదని స్పష్టం చేశారు. అయినా సరే కొందరు ఈ ఫేక్‌ న్యూస్‌ను గుడ్డిగా నమ్మేస్తూ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు షేర్‌ చేస్తూనే ఉన్నారు. కాబట్టి అసత్య వార్తలను విశ్వసించకండి, వాటిని ప్రోత్సహించకండి. (చదవండి: వ్యాక్సిన్‌తో జాంబీలుగా మారిపోతున్నారా?)

ఒక్కమాటలో: సాధారణ ట్రక్కులో మంటలు చెలరేగిన ఘటన పుణెలో జరిగింది, హైదరాబాద్‌లో కాదు.

మరిన్ని వార్తలు