సార్లు లేరు.. చదువుల్లేవు

27 Mar, 2022 02:43 IST|Sakshi
రేకుల షెడ్డుల్లో నడుస్తున్న శాతవాహన యూనివర్సిటీ ఫార్మసీ కళాశాల వసతిగృహం

రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో వెక్కిరిస్తున్న ఖాళీలు.. మూడింట రెండొంతుల ఫ్యాకల్టీ కాంట్రాక్టు, పార్ట్‌టైమే..

ఎక్కడ చూసినా మౌలిక సదుపాయాల కొరత

తాగునీటి నుంచి ల్యాబ్‌లలో పరికరాల దాకా సమస్యలే

సాక్షి ప్రతినిధి, నల్లగొండ/హైదరాబాద్‌/ ఉస్మానియా యూనివర్సిటీ/నాంపల్లి: ఉత్తమ విద్యకు, సరికొత్త పరిశోధనలు, ఆవిష్కరణలకు నిలయంగా.. విద్యార్థుల వికాసానికి తోడ్పడే కేంద్రంగా ఉండాల్సిన అత్యున్నత విద్యా సంస్థలే.. యూనివర్సిటీలు. కానీ రాష్ట్రంలో యూనివర్సిటీలకే ‘వికా సం’ లేని దుస్థితి. రెగ్యులర్‌ అధ్యాపకులు లేక నామ మాత్రపు బోధన ఒకవైపు.. ఏమాత్రం మౌలిక సదుపాయాలు లేక అవస్థలు మరోవైపు.. విద్యార్థుల భవిష్యత్తుకు గండి కొడుతున్నాయి. కొత్త పరిశోధనలు, ఆవిష్కరణలేమోగానీ కనీస ‘చదువు’కే దిక్కు లేకుండా పోతోందని.. ప్రభుత్వం నుంచి తగిన సాయం అందకపోవడం, అధికారుల నిర్లక్ష్యం, వ్యవస్థాపరమైన లోపాలు వంటివి వర్సిటీలకు శాపంగా మారాయని ఆందోళన వ్యక్తమవుతోంది.

ఏళ్లు గడుస్తున్నా నియామకాలేవి?
రాష్ట్రంలోని 11 యూనివర్సిటీల్లో మంజూరైన పోస్టు లు 2,828 ఉండగా.. అందులో 1,869 పోస్టులు అంటే మూడింట రెండొంతులు ఖాళీగానే ఉండటం గమనార్హం. నిజానికి 2017 నవంబర్‌ నాటికి యూనివర్సిటీల్లో 1,528 ఖాళీలు ఉన్నట్టు గుర్తిం చారు. అప్పట్లోనే 1,061 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కానీ ఇదుగో.. అదుగో అంటూ ఉన్నత విద్యాశాఖ, ఉన్నత విద్యా మండలి ఇప్పటికీ ఏమీ తేల్చలేదు. ఓ సారి రిజర్వే షన్లు అంశం అంటూ, మరోసారి న్యాయపరమైన వివాదా లు అంటూ, మరోసారి నియామకాల తీరుపై కసరత్తు చేస్తున్నామంటూ దాట వేస్తూ వచ్చాయి. దీనితో గత ఏడాది జనవరి 31 నాటికి ఖాళీల సంఖ్య 1,869కి పెరిగింది. కేటగిరీల వారీగా చూస్తే 238 ప్రొఫెసర్‌ పోస్టులు, 781 అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు, 850 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులకు సంబం ధించి కాంట్రాక్టు, తాత్కాలిక అధ్యాపకులతో బోధన నిర్వహిస్తూ మమ అనిపిస్తున్న పరిస్థితి నెల కొంది. దీనివల్ల పూర్తిస్థాయిలో బోధన అందడం లేదని, రెగ్యులర్‌ అధ్యాపకుల నియామకాలు చేపట్టాలని విద్యార్థులు డిమాండ్‌ చేస్తున్నారు.

వందేళ్ల ఉస్మానియాకూ తప్పని సమస్య
105 ఏళ్ల చరిత్ర కలిగిన ఉస్మానియా యూనివర్సిటీ కూడా ఫ్యాకల్టీ కొరత, మౌలిక సదుపాయాల లేమి తో సతమతం అవుతోంది. దాదాపు అన్ని విభాగా ల్లోనూ కాంట్రాక్టు, పార్ట్‌టైం అధ్యాపకులతో బోధన కొనసాగుతోంది. సీనియర్‌ ఫ్యాకల్టీ లేక పరి శోధనలనే మాటే లేకుండా పోయిందని.. పీజీ స్థాయిలో బోధన మొక్కుబడిగా సాగుతోందని విద్యార్థులు వాపోతున్నారు. ల్యాబ్‌లలో రసాయ నాలు, పరి కరాలు సరిగా లేవని.. ఇతర మౌలిక వసతులూ లేక ఇబ్బంది పడుతున్నామని అంటు న్నారు. జేఎన్టీయూ లోనూ ఇదే దుస్థితి నెలకొంది. ఇక ఉన్నత విద్యా మండలి ప్రతిష్టాత్మ కంగా నిజాం కాలేజీలో, కోఠి ఉమెన్స్‌ కాలేజీలో ప్రవేశపెట్టిన బీఏ ఆనర్స్‌ కోర్సుకు ఫ్యాకల్టీ సమస్య వేధిస్తోంది.
ఓయూలో పేరుకే ఫ్యాన్లు.. కానీ తిరగవు.. 

తెలుగు వర్సిటీలో ముగ్గురే..
దేశంలోనే మొట్టమొదటి భాషా విశ్వవిద్యాలయ మైన పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీ పరిస్థితి మరీ చిత్రం. ఇందులో మొత్తంగా ముగ్గురే రెగ్యులర్‌ ప్రొఫెసర్లు పనిచేస్తున్నారు. ఇందులోనూ ఒకరు రిజిస్ట్రార్‌గా, మరొకరు కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినర్‌ గా పనిచేస్తుండటం గమనార్హం. జ్యోతిషం, తెలు గు, ఇంగ్లిష్, కంప్యూటర్, భాషా అను బంధ శాఖ, విజ్ఞాన సరస్వత శాఖ. తులనాత్మక అధ్యయన శాఖ, జర్నలిజం, భాషాభివృద్ధి శాఖ, లింగ్విస్టిక్, భాషా నిఘంటు నిర్మాణ శాఖ జానపదం, సంగీ తం శాఖల్లో పోస్టులన్నీ ఖాళీయే. అన్నింటా తాత్కా లిక అధ్యాపకులతో బోధన కొనసాగిస్తున్నారు.

నీళ్లు కూడా సరిగా రావట్లేదు
మా హాస్టల్లో సరిగా వస తులు లేవు. మామూలు నీళ్లకే కాదు తాగునీటికీ ఇబ్బంది వస్తోంది. డైనింగ్‌ హాల్‌లో, ఇతర చోట్ల ఏర్పాట్లేమీ లేవు.
– పరశురామ్‌, మహాత్మాగాంధీ యూనివర్సిటీ విద్యార్థి 

‘తెలుగు’ ప్రొఫెసరే లేరు
తెలుగు విశ్వవిద్యాలయం ఏ భాషాభివృద్ధి కోసం ఏర్ప డిందో ఆ భాషకే సరైన దిక్కు లేకుండా పోయింది. తెలుగు శాఖలో కూడా రెగ్యు లర్‌ ఫ్యాకల్టీ లేకపోవడం శోచనీయం. వర్సిటీ పాలక మండలి నిద్రావస్థలో ఉంది.    
– శివకృష్ణ, రీసెర్చ్‌ స్కాలర్, తెలుగు వర్సిటీ

ఏ వర్సిటీ అయినా అంతే..
► కరీంనగర్‌లోని శాతవాహన వర్సిటీలో కీలకమైన మ్యాథ్స్, ఫార్మసీ, బోటనీ, కంప్యూటర్‌ సైన్స్‌ విభాగాల్లో రెగ్యులర్‌ అధ్యాపకులు ఒక్కరు కూడా లేరు.
► మహబూబ్‌నగర్‌లోని పాలమూరు విశ్వవిద్యాలయంలో ఇంటిగ్రేటెడ్‌ కెమిస్ట్రీ, ఎంబీఏ, ఎంఎస్‌డబ్ల్యూ విభాగాలను ఒక్క రెగ్యులర్‌ ఫ్యాకల్టీ లేకుండానే కొనసాగిస్తున్నారు. 
► వరంగల్‌ కాకతీయ వర్సిటీలో పొలిటికల్‌ సైన్స్, ఎడ్యుకేషన్‌ వంటి విభాగాల్లో రెగ్యులర్‌ అధ్యాపకులు లేరు. యూనివర్సిటీ ఇంజనీరింగ్‌ కళాశాల, కొత్తగూడెం ఇంజనీరింగ్‌ కళాశాలలో చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
► నల్లగొండలోని మహాత్మాగాంధీ వర్సిటీలో కొన్ని విభాగాల్లో ఒక్కొక్క ప్రొఫెసర్‌ మాత్రమే ఉన్నారు. కీలకమైన ఇంజనీరింగ్‌లో 48 పోస్టులు ఖాళీయే. మిగతా విభాగాల్లోనూ రెగ్యులర్‌ అధ్యాపకులు నామమాత్రమే.
► నిజామాబాద్‌ తెలంగాణ వర్సిటీలో కీలకమైన మ్యాథ్స్, ఎకనామిక్స్, ఫార్మాస్యూ టికల్‌ కెమిస్ట్రీ, ఇంటిగ్రేటెడ్‌ ఎంబీఏ విభాగాల్లో రెగ్యులర్‌ అధ్యాపకులే లేరు. మొత్తం 152 పోస్టులకుగాను రెగ్యులర్‌ సిబ్బంది 69 మందే.

హాస్టళ్లలో పరిస్థితీ ఇంతే..
► యూనివర్సిటీల్లో అధ్యాపకులు, మౌలిక సదుపాయాల కొరతకు తోడు హాస్టళ్ల లోనూ సమస్యలు వెంటాడుతున్నాయి. కొన్నిచోట్ల తాగునీటికీ ఇబ్బంది పడాల్సి వస్తోంది. పాలమూరు యూనివర్సిటీ హాస్ట ళ్లలో గదుల తలుపులు, కప్‌బోర్డులు విరిగి పోయాయి. కిచెన్‌ లేక ఆరుబయటే వం టలు చేయాల్సి వస్తోంది. మరుగుదొడ్లు అధ్వానంగా ఉన్నాయి. శాతవాహన వర్సి టీలో ఫార్మసీ కళాశాల, హాస్టళ్లు పాత భవనాలు, రేకులషెడ్లలో కొనసాగుతు న్నాయి. మహత్మాగాంధీ వర్సిటీ బాలికల హస్టల్‌లో తాగు నీటి సరఫరా సరిగా లేదని విద్యార్థినులు వాపోతున్నారు. 

మరిన్ని వార్తలు