వైరల్‌: ‘సీఎం కేసీఆర్‌కు ఈటల లేఖ’ కలకలం

26 Jun, 2021 03:28 IST|Sakshi

క్షమించమని సీఎంను కోరుతూ ఈటల రాసినట్లుగా పోస్ట్‌

వాట్సాప్‌లో పెట్టిన వ్యక్తిపై పోలీసులకు బీజేపీ ఫిర్యాదు

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌/వీణవంక: ‘టీఆర్‌ఎస్‌లో 20 ఏళ్లుగా తమ్ముడిలా చూసుకున్నారు. రాజకీయంగా అవకాశం ఇచ్చి మంత్రి స్థాయికి తీసుకెళ్లారు. నేను చేసిన కొన్ని పనులు తప్పే కావచ్చు. కానీ.. కొందరు వ్యక్తుల కారణంగా చేయాల్సి వచ్చింది. బెంగళూరు, పుణే, ఇతర చోట్ల నేను పెట్టిన సమావేశాలు కొందరి తప్పుడు మాటలతోనే. నా తప్పులను పెద్ద మనసుతో నన్ను తమ్ముడిగా భావించి క్షమించండి’ లాంటి మాటలతో మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ లెటర్‌ప్యాడ్‌పై ఆయన సం తకంతో సాగిన లేఖ కలకలం రేపింది.

ఈటలపై భూకబ్జా ఆరోపణలు వచ్చిన మరుసటి రోజు ముఖ్యమంత్రికి క్షమాపణలు చెపుతూ రాసినట్లుగా ఉన్న ఈ లేఖను కరీంనగర్‌ జిల్లా వీణవంక మండల టీఆర్‌ఎస్‌ నాయకుడు సాధవరెడ్డి శుక్రవారం వాట్సాప్‌లో పోస్ట్‌ చేశా డు. ఈ లేఖ ఫేక్‌ అని బీజేపీ కౌంటర్‌ ఇచ్చేలోగానే వైరల్‌ అయింది. దీనిపై బీజేపీ నాయకులు తీవ్రంగా స్పందించారు. ఈటల రాజేందర్‌ను రాజకీయంగా దెబ్బతీసేందుకు నకిలీ లేఖ తయారు చేసి సోషల్‌ మీడియాలో పోస్టు చేశారని సాధవరెడ్డిపై వీణవంక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

 

మరిన్ని వార్తలు