మంత్రాల నెపంతో దంపతులపై దాడి

15 Feb, 2022 01:36 IST|Sakshi
దంపతులను స్తంభానికి కట్టేసిన దృశ్యం

కరెంట్‌ స్తంభానికి కట్టేసి కొట్టిన వైనం 

మెదక్‌ జిల్లా అల్లాదుర్గంలో ఘటన 

అల్లాదుర్గం(మెదక్‌): మంత్రాలు(చేతబడి) చేస్తున్నారనే నెపంతో దంపతులను  కరెంటు స్తంభానికి కట్టేసి దాడి చేసిన ఘటన మెదక్‌ జిల్లాలో చోటు చేసుకుంది. అల్లాదుర్గం గ్రామానికి చెందిన బోయిని కిష్టయ్య అనారోగ్యానికి గురయ్యారు. ఆస్పత్రుల చుట్టూ తిరిగినా నయం కాలేదు. తమ పాలివారైన రమేశ్‌ కుటుంబం చేతబడే... కిష్టయ్య అనారోగ్యానికి కారణమని ఆరోపిస్తూ ఆయన కుటుంబీకులు ఆదివారంరాత్రి గొడవపడ్డారు.

సోమవారం ఉదయం మళ్లీ గొడవకు దిగి రమేశ్‌ను, ఆయన భార్య రజితను ఇంట్లో నుంచి ఈడ్చుకొచ్చి నడిరోడ్డుపై స్తంభానికి వైర్లతో కట్టేశారు.   కట్టెలతో కొట్టారు.  పోలీసులు వచ్చి రమేశ్‌ దంపతులను ఆసుపత్రికి తరలించారు. రమేశ్‌ ఫిర్యాదు మేరకు కిష్టయ్య కొడుకులు కుమార్, నగేశ్, భేతయ్య, భార్య ఆశమ్మ, కూతురు అంబమ్మపై కేసు నమోదు చేశారు. వారిని అరెస్టు చేసి జోగిపేట కోర్టుకు రిమాండ్‌కు తరలించారు.

మరిన్ని వార్తలు