ఆ కుమార్తెలకు ఫ్యామిలీ పెన్షన్‌ రాదు.. తెలంగాణ సర్కారు క్లారిటీ

5 Aug, 2022 02:22 IST|Sakshi

వితంతు, విడాకులు పొందిన కుమార్తెల విషయంలో సర్కారు స్పష్టీకరణ

ఉద్యోగి/పెన్షనర్‌ మరణానికి ముందే జీవిత భాగస్వామి మరణించి లేదా విడాకులు పొంది ఉండాలి

అప్పుడే వితంతు, విడాకులు పొందిన కుమార్తెలకు పింఛనుకు అర్హత

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ ఉద్యోగి/పెన్షనర్‌ మరణానంతరం జీవిత భాగస్వామికి ఫ్యామిలీ పెన్షన్‌ (కుటుంబ పింఛను)ను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. అయితే ఫ్యామిలీ పెన్షన్‌ పొందిన ఆ జీవిత భాగస్వామి మర­ణిస్తే.. ఆ వ్యక్తిపై ఆధార­పడిన వితంతు/ విడాకులు పొందిన కుమార్తె ఆ తర్వాత ఫ్యామిలీ పెన్షన్‌ పొందడానికి అర్హురాలు కాదని తాజాగా రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఎవరైనా ఉద్యోగి/పెన్షనర్‌ మరణిస్తే..అంతకుముందే వారి జీవిత భాగస్వామి మరణించి/ విడాకులు పొంది ఉన్న సందర్భాల్లో మాత్రమే.. వితంతువు/విడాకులు పొందిన కుమార్తెకు ఫ్యామిలీ పెన్షన్‌ జారీ చేయాల్సిందిగా 2010లో నాటి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపింది. ఈ ఉత్తర్వులను తప్పుగా అన్వయించుకుని ఫ్యామిలీ పెన్షనర్ల మరణానంతరం వారిపై ఆధారపడిన వితంతువు/విడాకులైన కుమార్తెలకు తదుపరిగా ఫ్యామిలీ పెన్షన్లు జారీ చేయరాదని ఆదేశించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి డి.విజయకుమారి ఇటీవల అకౌంటెంట్‌ జనరల్‌ (ఏజీ)తో పాటు ట్రెజరీ విభాగానికి లేఖ రాశారు.

మరిన్ని వార్తలు