కామారెడ్డిలో ఉద్రిక్తత.. బెడిసికొట్టిన మున్సిపల్‌ మాస్టర్‌ ప్లాన్‌!

5 Jan, 2023 09:28 IST|Sakshi

సాక్షి, కామారెడ్డి: జిల్లాలోని అడ్లూరులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మాస్టర్‌ ప్లాన్‌లోని భూమి కోల్పోవడంతో రాములు అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా, రాములు ఆత్మహత్యతో రైతులు ఆందోళనకు దిగారు. అయితే, గత నెలరోజులుగా మాస్టర్‌ ప్లాన్‌పై కామారెడ్డి రైతులు ధర్నా చేస్తున్నారు. మాస్టర్‌ ప్లాన్‌ విషయంలో రాములు సూసైడ్‌ నోట్‌తో ఈ రగడ మరింతగా ముదిరింది. 

జరిగింది ఇదే..
కామారెడ్డి టౌన్‌: సదాశివనగర్‌ మండలం అడ్లూర్‌ ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన పయ్యావుల రాములు(42)కు కామారెడ్డి పట్టణ శివారులోని ఇలి్చపూర్‌ వద్ద 3 ఎకరాల సాగుభూమి ఉంది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాములు ఆ భూమిని గతంలోనే అమ్మకానికి పెట్టాడు. మున్సిపల్‌ నూతన మాస్టర్‌ప్లాన్‌ ప్రతిపాదనల్లో ఆయన భూమిని ఇండ్రస్టియల్‌ జోన్‌లోకి మార్చడంతో భూమి అమ్ముడుపోవడం లేదు. దీంతో మనస్తాపానికి గురైన రాములు మంగళవారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మాస్టర్‌ ప్లాన్‌ బాధిత రైతులు బుధవారం మృతదేహాన్ని ట్రాక్టర్‌లో తీసుకుని బల్దియా వద్ద ఆందోళన చేయడానికి బయలుదేరగా.. పోలీసులు కామారెడ్డి బస్టాండ్‌ వద్ద అడ్డుకున్నారు. దీంతో రైతులు రెండు గంటలపాటు రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా పోలీసులతో వాగ్వాదం జరిగింది. రైతులు మృతదేహాన్ని అక్కడే వదిలేసి బల్దియా కార్యాలయానికి వెళ్లి ఆందోళన చేశారు. అనంతరం పోలీసులు కొత్తబస్టాండ్‌ వద్దనున్న మృతదేహాన్ని అశోక్‌నగర్‌ కాలనీ, రైల్వేగేట్, పాత బస్టాండ్‌ మీదుగా జిల్లా ఆస్పత్రికి తరలించారు. 

బల్దియా వద్ద ధర్నా 
తన భర్త మృతదేహన్ని అనుమతి లేకుండా పోలీసులు ఏరియా ఆస్పత్రికి తరలించడంపై మృతుడి భార్య శారద నిరసన తెలిపింది. ఆమె పెద్ద కుమారుడు అభినందు, చిన్న కుమారుడు నిషాంత్, బంధువులతో కలిసి మున్సిపల్‌ కార్యాలయం ముందున్న అంబేడ్కర్‌ విగ్రహం వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. రైతులు మున్సిపల్‌ కార్యాలయం గేటు వద్ద ఆందోళన చేశారు. కమిషనర్‌ కమీషనర్‌ రాగానే ఆయనతో వాగ్వాదానికి దిగారు. మద్యాహ్నం నుంచి రాత్రి వరకు ఆందోళన కొనసాగింది. ఆందోళనలో లింగాపూర్, అడ్లూర్‌ఎల్లారెడ్డి, ఇలి్చపూర్‌ తదితర గ్రామాల రైతులు పాల్గొన్నారు.  

నా కుటుంబాన్ని ఆదుకోండి 
తన కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఆత్మహత్య చేసుకున్న రాములు భార్య పయ్యావులు శారద కోరింది. బుధవారం రాత్రి ఆమె ఆందోళన విరమించి, కుటుంబ సభ్యులతో కలి సి ఏరియా ఆస్పత్రికి వెళ్లింది. ప్రభుత్వం, అధి కారుల నిర్లక్ష్యం వల్ల తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని పేర్కొంది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా మని, ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని గ్రామనికి తీసుకువెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. 

మరిన్ని వార్తలు