తనయుల కోసం తనువు చాలిస్తున్న తండ్రులు

17 Jan, 2021 09:20 IST|Sakshi

సింగరేణి కుటుంబాల్లో ‘కారుణ్య’ చీకట్లు

పిల్లలకు ఉద్యోగం కోసం తపన

సంస్థ ఉద్యోగుల్లో ఆందోళనకర ధోరణి

మెడికల్‌ అన్‌ఫిట్‌ కాకపోతే చావు వైపు చూపు

రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని యైటింక్లైన్‌ కాలనీకి చెందిన మల్లేశం (59) సింగరేణి ఓసీపీ1లో ఈపీ ఆపరేటర్‌గా పనిచేసేవాడు. ఇతనికి ఇద్దరు కుమారులు, ఒక కూతురు. పెద్ద కుమారుడు విదేశాల్లో ఉద్యోగం చేస్తుండగా, చిన్న కుమారుడు బీటెక్‌ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు. ఆరోగ్యం బాగా లేకపోవడంతో తన కుమారునికి ఉద్యోగం ఇప్పించాలని కోరుతూ మల్లేశం గత సంవత్సరం మెడికల్‌ అన్‌ఫిట్‌ కోసం సింగరేణి మెడికల్‌ బోర్డుకు దరఖాస్తు చేసుకున్నాడు. కానీ బోర్డు ఆయనను అన్‌ఫిట్‌ చేయలేదు. దీంతో తన కుమారుడికి వారసత్వ ఉద్యోగం రాదన్న మనోవేదనతో మల్లేశం ఈ నెల 3న ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

వరంగల్‌ అర్బన్‌ జిల్లాకు చెందిన రాజయ్య (59) ఆర్‌జీ2 పరిధిలోని పోతన కాలనీలో ఉంటూ ఓసీపీ 3లో జనరల్‌ మజ్దూర్‌గా పనిచేస్తున్నాడు. రెండున్నరేళ్ల క్రితం గుండె ఆపరేషన్‌ కావడంతో విధులకు దూరంగా ఇంట్లోనే ఉంటున్నాడు. ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా కుమారుడికి వారసత్వ ఉద్యోగం ఇప్పించేందుకు ప్రయత్నం చేశాడు. గత డిసెంబర్‌ 20న కొత్తగూడెంలో సింగరేణి మెడికల్‌ బోర్డుకు వెళ్లివచ్చాడు. అయితే 
సానుకూలంగా స్పందన రాకపోవడంతో తన కుమారుడికి ఉద్యోగం ఇప్పించలేకపోతున్నాననే మనోవేదనతో అదే నెల 22న పురుగు మందు తాగి చికిత్స పొందుతూ 27న తనువు చాలించాడు. సింగరేణి కుటుంబాల్లో ‘కారుణ్యపు’ చీకట్లకు ఈ రెండు సంఘటనలు ఉదాహరణలు. 

సాక్షి, పెద్దపల్లి : పిల్లలకు మంచి భవిష్యత్‌ను ఇవ్వాలన్న తపన, వారికి మంచి ఉద్యోగాలు రాకపోతే ఏమిటన్న బెంగ పలువురు సింగరేణి ఉద్యోగులను మృత్యువు వాకిట్లోకి నెట్టేస్తోంది. ‘మెడికల్‌ ఇన్‌వాలిడేషన్‌’ కాకపోవడం, పిల్లలకు వారసత్వంగా ఉద్యోగం ఇప్పించలేకపోతుండడంతో ఉద్యోగులు పదవీ విరమణకు ముందే జీవితాన్ని ముగిస్తున్నారు. ఏ విధంగా చనిపోయినా తమ వారసులకు వారసత్వ ఉద్యోగం లభిం చే వెసులుబాటు ఉండటంతో కొందరు విధిలేని పరిస్థితుల్లో బలవంతంగా తనువు చాలిస్తున్నారు. దశాబ్దాలుగా సేవలందిస్తూ.. సంస్థలో భాగమైన ఉద్యోగుల వారసులకు కూడా సింగరేణిలో ఉద్యోగం ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కారుణ్య నియామకాలను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. దీని ప్రకారం విధులు నిర్వర్తించడానికి ఆరోగ్యం సహకరించని ఉద్యోగులను మెడికల్‌గా అన్‌ఫిట్‌ అని పరిగణిస్తూ వారి వారసుల (కొడుకు, కూతురు, అల్లుడు)కు సింగరేణిలో ఉద్యోగం కల్పిస్తారు.

పదవీ విరమణకు రెండేళ్ల ముందు వరకే ఈ కారుణ్య నియామకాలు వర్తిస్తాయి. ఆ తరువాత అవకాశం ఉండదు. కానీ సర్వీసు ఒకరోజు మిగిలి ఉండగా మృతిచెందినా, వారసులకు ఉద్యోగ అవకాశం ఉం టుంది. నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉన్న ఈ పరిస్థితుల్లో తమ ఉద్యోగ విరమణ అనం తరం వారసులకు శాశ్వత ఉ పాధి చూపించాలనే తపనతో చాలామంది సింగరేణి ఉద్యోగులు కారుణ్య నియామకాల వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో ఆరోగ్యంగా ఉన్న ఉ ద్యోగులు కూడా మెడికల్‌ ఇన్‌వాలిడేషన్‌కు దరఖాస్తు చేసుకుంటున్నారు. అయితే ఈ దరఖాస్తులను మెడికల్‌ బోర్డు తిరస్కరించడంతో ఒత్తిడికి లోనవుతున్నారు. పిల్లల భవిష్యత్‌కోసం తండ్రులు చివరకు ప్రా ణాలు కూడా తీసుకుంటుండడం ప్రస్తుతం సింగరేణి వ్యా ప్తంగా కలవరం సృష్టిస్తోంది.

ఆరోగ్యం బాగోలేకపోతేనే.. 
కారుణ్య నియామకాల కోసం సింగరేణి మెడికల్‌ బోర్డు నెలలో కనీసం రెండుసార్లు కొత్తగూడెంలో భేటీ అవుతోంది. అప్పటివరకు వచ్చిన దరఖా స్తుల ఆధారంగా ఉద్యోగులను పరీక్షించిన వైద్యు లు, వారి ఆరోగ్యం ఉద్యోగం చేయడానికి అనువుగా ఉందా, లేదా అన్నది నిర్ధారిస్తారు. అన్‌ఫిట్‌ అయితేనే వారసులకు ఉద్యోగాలు ఇచ్చేందుకు మార్గం సుగమమవుతుంది. సదరు ఉద్యోగి ఆరోగ్యంగా ఉన్నాడని పరీక్షలో తేలితే అదే ఉద్యోగం లో కొనసాగాలని ఆదేశిస్తారు. 2018 ఏప్రిల్‌ 7 నుంచి 2021 జనవరి 6 వరకు 66 సార్లు మెడికల్‌ బోర్డు భేటీ కాగా, 12,117 మంది దరఖాస్తు చేసుకున్నారు. అందులో 7,524 మంది మెడికల్‌ అన్‌ఫిట్‌ అయ్యారు. 2,537 మంది ఉద్యోగుల దరఖాస్తులను తిరస్కరించారు. కాగా తమ వారసు ల భవిష్యత్‌కు బాటలు వేసే క్రమంలో మూడు, నాలుగు దశాబ్దాల శ్రమ అనంతరం ప్రశాంతమైన విశ్రాంత జీవితం గడపాల్సిన స్థితిలో సింగరేణి ఉద్యోగులు ఇలా వారసుల కోసం అర్ధంతరంగా తనువులు చాలిస్తున్న వ్యథ ప్రస్తుతం సింగరేణిని కలచివేస్తోంది. 

మరిన్ని వార్తలు