ఎమ్మార్వో కార్యాలయంలో.. పెట్రోల్ కలకలం

26 Aug, 2020 18:07 IST|Sakshi

సాక్షి, సిద్దిపేట : తహసీల్దార్ కార్యాలయం లోపలికి వెళ్లి తలుపులు వేసుకుని పెట్రోల్ డబ్బాలతో అత్మహత్య చేసుకుంటామని తండ్రీ కూతుళ్లు ఆందోళన వ్యక్తం చేశారు. సంవత్సరాల నుంచి కోహెడ ఎమ్మార్వో కార్యాలయం చుట్టూ తిరిగినా అధికారులు పట్టించు కోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ తహసీల్దార్ కార్యాలయం లోపలికి వెళ్లి తలుపులు వేసుకుని పెట్రోల్ డబ్బాలతో అత్మహత్య చేసుకుంటామని నిరసన వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం చెంచలచెరువులపల్లి గ్రామానికి చెందిన భీంరెడ్డి తిరుపతి రెడ్డి, అతని కుమార్తె స్వరూప తమ భూమి వేరే వాళ్ల పేరు మీద అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారని వాపోయారు. 

తన తండ్రి తిరుపతి రెడ్డికి చెందిన ఎకరం 30 గుంటల భూమిని తన పేరుమీద 2011 లో రిజిస్ట్రేషన్ చేయించారని అప్పటినుండి మ్యుటేషన్ చేయాలని తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని బాధితురాలు స్వరూప అన్నారు. ఈ మధ్యకాలంలో పహాణీలో తన తండ్రి పేరును తొలగించి వేరే వాళ్ల పేరు మీద భూమిని నమోదు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఉన్న తహసీల్దార్, ఇప్పుడున్న తహసీల్దార్ భూమి మోక మీదకి వచ్చి తనిఖీ చేసి హద్దులు నిర్ణయించి భూమి తమ పేరు మీదనే చేస్తామని చెబుతున్నారు కానీ చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వేరే వ్యక్తి తమ భూమిలో గత కొన్ని రోజులుగా దున్నతున్నాడని, పోలీసులను ఆశ్రయిస్తే పోలీసులు సైతం తమను తమ కుటుంబాన్ని బెదిరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 

తమకు న్యాయం చేసేంతవరకు తహసీల్దార్ కార్యాలయంలోనే ఉంటామని లేకుంటే కార్యాలయంలోనే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించారు. విషయం తెలుసు తహసీల్దార్, పోలీసులు బాధితులకు నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు.

మరిన్ని వార్తలు