నేనేం పాపం చేశాను నాన్నా? 

6 Jan, 2023 10:30 IST|Sakshi

మహబూబ్‌నగర్‌ క్రైం: భార్య కాపురానికి రావడం లేదన్న కోపంతో ఓ భర్త దారుణానికి ఒడిగట్టాడు. భార్యపై ఉన్న ఆక్రోశంతో తన ఆరేళ్ల కూతురిని గొంతు నులిమి హత్య చేశాడు. ఈ విషాదకర ఘటన మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ పరిధిలో చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

వివరాల ప్రకారం.. పాలకొండ తండాకు చెందిన నేనావత్‌ శివ, శోభకు ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నాడు. పెళ్లయిన కొత్తలో బాగానే ఉన్నప్పటికీ.. కొంతకాలానికి శివ మద్యానికి అలవాటుపడి తరచూ భార్యతో గొడవపడి కొట్టేవాడు. ఈ క్రమంలో పది రోజుల కిందట భార్యను కొట్టడంతో పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లింది. దీంతో శివ భార్య పుట్టింటికి వెళ్లి పెద్ద కూతురు కీర్తన (6) ఇంటికి తీసుకొచ్చాడు. ఈనెల 4న కీర్తనను శివ కొట్టాడు. 

దీంతో బాలిక అమ్మ కావాలని మారాం చేసింది. కోపోద్రిక్తుడైన తండ్రి ఏమాత్రం కనికరం లేకుండా కూతురు ముక్కు మూసి, గొంతు నులిమి హత్య చేశాడు. ఆ తర్వాత పాప పలకడం లేదని ఆటోలో జిల్లా జనరల్‌ ఆస్పత్రికి తీసుకొచ్చాడు. అప్పటికే కీర్తన మృతి చెందిందని వైద్యులు చెప్పారు. మృతురాలి తల్లి శోభ ఇచ్చిన ఫిర్యాదు మేరకు శివపై పోలీసులు హత్య కేసు నమోదుచేసి అదుపులోకి తీసుకున్నారు. మృతదేహనికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించినట్లు ఎస్‌ఐ వెంకటేశ్వర్లు వెల్లడించారు. 

మరిన్ని వార్తలు