ఏ తండ్రికి ఈ కష్టం రావొద్దు.. బైక్‌పై చిన్నారి మృతదేహం తరలింపు

7 Nov, 2022 15:04 IST|Sakshi

సాక్షి, ఖమ్మం:  చికిత్స పొందుతూ ఓ చిన్నారి మృతి చెందింది. స్వగ్రామం తరలించేందుకు ఆసుపత్రి అంబులెన్స్‌ లేదు. ప్రైవేటు వాహనాల్లో తరలించేందుకు ఆర్థిక స్తోమత లేదు. దీంతో ఏం చేయాలో పాలుపోని ఆమె తండ్రి.. గుండెలనిండా దుఃఖాన్ని నింపుకొని బైక్‌పైనే మృతదేహాన్ని స్వగ్రామానికి చేర్చాడు. ఈ హృదయవిదారక సంఘటన ఖమ్మం జిల్లాలోని ఏకనూరు మండలం కొత్త మేడేపల్లి గ్రామంలో ఆదివారం జరిగింది. 

కొత్త మేడేపల్లి గ్రామంలోని గిరిజన వర్గానికి చెందిన వెట్టి మల్లయ్య కూతురు వెట్టి సుక్కి(3) కొద్ది రోజుల క్రితం అనారోగ్యానికి గురైంది. దీంతో ఏకనూరు ఆసుపత్రికి తరలించారు. చిన్నారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో ఖమ్మం జిల్లా మాతా, శిశు సంక్షేమ ఆసుపత్రికి తీసుకెళ్లాలని అక్కడి వైద్యులు తెలిపారు. చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం పాప మృతి చెందింది. అయితే, ఆమె మృతదేహాన్ని 65 కిలోమీటర్ల దూరంలోని స్వగ్రామం కొత్త మేడేపల్లికి తరలించేందుకు ప్రైవేటు అంబులెన్స్‌కు డబ్బులేక ద్విచక్రవాహనంపై తరలించాడు ఆమె తండ్రి వెట్టి మల్ల. ఆసుపత్రి అంబులెన్స్‌ ఇవ్వనన్నారని ఆవేదన వ్యక్తం చేశాడు.

ఇదీ చదవండి: ధనబలం, అంగబలంతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు: పాల్వాయి స్రవంతి

మరిన్ని వార్తలు