4 కోట్ల ఆస్తులు: బుక్కెడు బువ్వ పెట్టరూ..

14 Jun, 2021 06:48 IST|Sakshi

హుస్నాబాద్‌:  కొడుకులను పెంచి ప్రయోజకులను చేస్తే అప్పులు అంటగట్టడమే కాకుండా కనీసం బు క్కెడు బువ్వ కూడా పెట్టడం లేదంటూ రూ. 4 కోట్ల ఆస్తులున్న ఓ తండ్రి పడుతున్న ఆవేదనకు అద్దం పట్టే చిత్రమిది. అన్నం వండుకోవడానికి కూడా చేత కాని పరిస్థితుల్లో ఉన్న తనకు తిండి పెట్టాలని బతిమిలాడినా పట్టించుకోవడం లేదంటూ ఓ పెద్దా యన ఆమరణ దీక్షకు దిగిన వైనమిది. సిద్దిపేట పట్టణానికి చెందిన కొత్తకొండ స్వామి అనే వృద్ధు డు తన కుమారులైన సంతోశ్, సుధాకర్‌ల మనసు కరగాలని ఆదివారం రాత్రి వారి ఇంటి ముందు  బ్యానర్‌ కట్టుకొని ఇలా నిరశనకు దిగాడు.

కౌలురైతు ఆత్మహత్యాయత్నం 
కోనరావుపేట: కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చిన ధాన్యం వర్షంలో తడిసి మొలకెత్తడంతో ఓ కౌలు రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం ధర్మారంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఆసరి అంజయ్య కొంత భూమిని కౌలుకు తీసుకుని వరి సాగు చేశాడు. పండిన ధాన్యాన్ని సింగిల్‌విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో కొద్దిరోజుల క్రితం పోశాడు.

కొనుగోళ్లలో జాప్యం జరగగా.. ఇటీవల కురుస్తున్న వర్షాలకు అతని ధాన్యం తడిసి మొలకెత్తింది. దీం తో ఆ ధాన్యాన్ని కొనుగోలు చేస్తారో లేరోనని ఆందోళన చెందిన అంజయ్య క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని ఎల్లారెడ్డిపేటలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

దీనిపై కొనుగోలు కేంద్రం సిబ్బందిని వివరణ కోరగా.. ధాన్యాన్ని తూర్పారబడితే తూకం వేస్తామని సదరు రైతు కుమారుడికి సమాచారం ఇచ్చామని, అయినా ఆ రైతు రాకపోవడంతో తూకం వేయలేదని సమాధానమిచ్చారు.
చదవండి: త్వరలో డిగ్రీ ప్రవేశాల నోటిఫికేషన్‌ 

మరిన్ని వార్తలు