ఆక్సిజన్‌ ట్యాంకర్‌పై  మంటలు 

30 May, 2021 08:17 IST|Sakshi

కరోనా బాధితుల కోసం తరలిస్తుండగా పెద్దపల్లి వద్ద ఘటన 

సకాలంలో ఆదుపులోకి మంటలు 

సాక్షి, పెద్దపల్లికమాన్‌: కరోనా బాధితులకు అందించేందుకు గూడ్స్‌లో తరలిస్తున్న ఆక్సిజన్‌ ట్యాంకర్‌పై మంటలు చెలరేగాయి. ఈ ఘటన పెద్దపల్లి రైల్వే స్టేషన్‌లో చోటుచేసుకుంది. సకాలంలో అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు ఆర్పడంతో పెనుప్రమాదం తప్పింది. హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌ నుంచి రాయ్‌పూర్‌కు ఆరు ఖాళీ ట్యాంకర్లతో బయల్దేరిన గూడ్స్‌ రైలు శనివారం పెద్దపల్లి రైల్వే జంక్షన్‌కు చేరుకుంది. ఉదయం 11.02 గంటలకు చీకురాయి సమీపంలోని ఎల్‌సీ గేట్‌ నంబర్‌ 38కి చేరుకోగానే ఓ ట్యాంకర్‌ నుంచి పెద్దగా శబ్ధం వచ్చి మంటలు చెలరేగాయి.

గమనించిన గేట్‌మన్‌ రాజసాగర్‌ డ్యూటీలో ఉన్న పెద్దపల్లి స్టేషన్‌ మాస్టర్‌కు సమాచారమందించారు. స్పందించిన స్టేషన్‌మాస్టర్‌ వెంకట్‌ ఫైర్‌స్టేషన్‌కు సమాచారమిచ్చారు. వెం టనే రైలును ఆపించి మంటలున్న ట్యాంకర్‌ నుంచి మిగతా బోగీలను వేరుచేశారు. సమయానికి సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్‌ సిబ్బంది ట్యాంకర్‌కున్న మంటలను అదుపులోకి తెచ్చారు. రైల్వే అధికారులు, లిండే ఆక్సిజన్‌ కంపెనీ ప్రతినిధులు ప్రాథమికంగా దర్యాప్తు చేశారు. ట్యాంకర్‌ ఖాళీచేసిన తర్వాత కొంత ఆక్సిజన్‌ ట్యాంకర్‌లోనే ఉంటుందని, అది లీకై మంటలు చెలరేగి ఉంటాయని ప్రాథమికంగా తెలిపారు.  

చదవండి: అంబులెన్స్‌ ధరలు.. మోటారుసైకిల్‌పై మృతదేహం తరలింపు

మరిన్ని వార్తలు