హైదరాబాద్‌ నుంచి వియత్నాంకు విమాన సర్వీసులు.. 4 గంటల్లోనే

30 Aug, 2022 02:19 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ నుంచి నేరుగా వియత్నాంకు విమాన సర్వీసులు త్వరలో ప్రారంభం కానున్నాయి. శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వియత్నాంలోని హనోయి, హో చి మిన్, డా నాంగ్‌ నగరాలకు వియట్‌జెట్‌ ఫ్లైట్‌లను నేరుగా నడుపనున్నట్లు జీఎమ్మార్‌ ఎయిర్‌పోర్టు సీఈవో ప్రదీప్‌ ఫణికర్‌ తెలిపారు. ఈ సర్వీసులు 4 గంటల్లో వియత్నాం చేరుకుంటాయి.

హనోయికి అక్టోబర్‌ 7న, హో చి మిన్‌ సిటీకి అక్టోబర్‌ 9న, డా నాంగ్‌కు నవంబర్‌ 29వ తేదీన వియట్‌జెట్‌ తొలి విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. వారానికి నాలుగు సార్లు ఈ విమాన సర్వీసులు ఉంటాయి. వియత్నాంకు నేరుగా విమాన సర్వీసులు అందుబాటులోకి రావడం వల్ల పర్యాటకరంగం అభివృద్ధి చెందుతుందని ఫణికర్‌ అభిప్రాయపడ్డారు.

అలాగే వ్యాపార, వాణిజ్య రంగాల్లోను సంబంధాలు మెరుగు పడతాయన్నారు. కొత్త సర్వీసుల వల్ల భారతదేశంలో తమ నెట్‌వర్క్‌ బలోపేతం అవుతుందని వియట్‌జెట్‌ కమర్షియల్‌ డైరెక్టర్‌ జె.ఎల్‌.లింగేశ్వర అన్నారు. ఆగ్నేయ, ఈశాన్య ఆసియా దేశాలకు వారధిగా ఉన్న వియత్నాం సౌందర్యాన్ని ఆస్వాదించడానికి రావాలని ఆయన హైదరాబాద్‌ పర్యాటకులను ఆహ్వానించారు.   

మరిన్ని వార్తలు