Hyderabad-Delivery Boy: ఫుడ్‌ డెలివరీ ఆలస్యమైందని దారుణం.. డెలివరీ బాయ్‌ వెంటపడి మరీ..

3 Jan, 2023 17:46 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ :  హుమయూన్‌నర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఓ వ్యక్తి దుర్మార్గంగా ప్రవర్తించాడు. ఫుడ్‌ ఆర్డర్‌ ఆలస్యమైందని డెలివరీ బాయ్‌పై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. తన అనుచరులు 15 మందితో కలిసి మాసబ్‌ ట్యాంక్‌లోని హోటల్‌ వద్దకు వచ్చాడు.  వారితో కలిసి అక్కడ భయానక వాతావరణం సృష్టించాడు. భయంతో సదరు డెలివరీ బాయ్‌ హోటల్‌లోకి పరుగుతీశాడు. 

వారు కూడా అతన్ని వెంబడిస్తూ హోటల్‌లోకి పరుగెత్తి మరీ  డెలివరీ బాయ్‌పై మూకుమ్మడిగా దాడి చేశారు. హోటల్ లోపలే అతడిని పట్టుకుని చితకబాదారు. హోటల్‌ సిబ్బంది గొడవను ఆపేందుకు ప్రయత్నించగా ఫలించలేదు. దాడి నుంచి తప్పించుకోవడానికి వంటగదిలోకి వెళ్లగా.. స్టౌమీద ఉన్న మరుగుతున్న నూనె మీద పడింది. దీంతో ఫుడ్‌  డెలివరీ బాయ్‌తో పాటు మరో ఇద్దరు హోటల్‌ సిబ్బందికి సైతం గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. 

ఫుడ్ డెలివరీ బాయ్ ఇలియాస్, హోటల్ ఉద్యోగులు సోను, సజ్జన్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ ఘటనలో ప్రధాన నిందితుడు, అతని ముగ్గురు కుమారులు సహా ఐదుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. దాడికి పాల్పడిన మరికొందరిని గుర్తించి అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు