కలుషిత ఆహారంతో 29 మంది చిన్నారులకు అస్వస్థత

7 Jan, 2023 00:58 IST|Sakshi
విద్యార్థుల వివరాలు సేకరిస్తున్న సిరిసిల్ల ఆస్పత్రి వైద్యులు 

సిరిసిల్ల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో సంఘటన

సిరిసిల్లటౌన్‌: కలుషిత ఆహారంతో 29 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా రాచర్ల గొల్లపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం చోటుచేసుకుంది. వీరిలో ఏడుగురు విద్యార్థులు వాంతులు, డీహైడ్రేషన్‌ బారిన పడ్డారు. బడిలో కొత్తగా నిర్మిస్తున్న సంపులో నింపిన నీటితో మధ్యాహ్న భోజనం వండి పిల్లలకు పెట్టారు. మధ్యాహ్నం ఒంటి గంటకు భోజనం చేసిన విద్యార్థుల్లో 2 గంటలకు ఫుడ్‌పాయిజన్‌ లక్షణాలు కనిపించాయి.

అస్వస్థతకు గురైన విద్యార్థులు ఒకటో తరగతిలో ఐరా, వర్షిణి, రిషిత, రెండో తరగతిలో వర్షిణి, శ్రీజ, లక్కీ, వేదిక, వినతి, వరుణ్, శ్రీలక్ష్మి, మూడో తరగతిలో చెఫాన్, వర్షిణి, రిషి, నాలుగో తరగతిలో సంజన, ధీరజ్, రిషివర్ధన్, నిశాంత్, శివ, చరణ్, గౌతమ్, అభిలాష్, ఐదో తరగతిలో రాంచరణ్, శ్రీజ, రిష్రిత్, లాస్య, శామన్‌లిల్లి, రిషివర్ధన్, దివ్య, రిషిత్, ఇందు ఉన్నారు.

29 మంది చిన్నారులను 108 వాహనంలో సిరిసిల్ల జిల్లా ఆస్పత్రికి తీసుకురాగా డీఎంహెచ్‌వో సుమన్‌ మోహన్‌రావు, ఆస్పత్రి సూపరింటెండెంట్‌ మురళీధర్‌రావు ఆధ్వర్యంలో చికిత్స అందించారు. చికిత్స అనంతరం 25 మందిని డిశ్చార్జి చేయగా.. తీవ్ర అస్వస్థతకు గురైన నలుగురికి ప్రత్యేక వైద్యం అందిస్తున్నారు. సంఘటనపై జిల్లా విద్యాధికారి రాధాకిషన్‌ విచారణకు ఆదేశాలిచ్చారు. మంత్రి కేటీఆర్‌ పిల్లల  పరిస్థితిని తెలుసుకుని తదుపరి చర్యలకు డీఈవోకు ఆదేశాలు జారీచేశారు.

మరిన్ని వార్తలు