పంట కాల్వ మూసివేత సరికాదు

10 Jun, 2022 01:16 IST|Sakshi
కొల్లాపూర్‌ నుంచి పంట కాల్వ వద్దకు ర్యాలీగా వస్తున్న జూపల్లి కృష్ణారావు 

వెంటనే పునరుద్ధరించాలి: జూపల్లి

కేఎల్‌ఐ డీ–5 కాల్వ వరకు పాదయాత్ర

కొల్లాపూర్‌/కొల్లాపూర్‌ రూరల్‌: పాలమూరు ప్రాజెక్టు ప్రధానకాల్వ అనుసంధానం కోసం కేఎల్‌ఐ డీ–5 పంటకాల్వను మూసివేయడం సరికాదని, వెంటనే దానిని పునరుద్ధరించాలని మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు డిమాండ్‌ చేశారు. కొల్లాపూర్‌ మండలం సున్నపుతండా సమీపంలోని కేఎల్‌ఐ డీ–5 పంటకాల్వను పూడ్చివేశారని తెలియడంతో గురువారం భారీ అనుచరగణంతో ఆయన కొల్లాపూర్‌ నుంచి పంటకాల్వ వరకు పాదయాత్ర నిర్వహించారు.

అధి కారులపై ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డి ఒత్తిడి తెచ్చి దొంగచాటుగా అర్ధరాత్రి కాల్వ మూసివేయించారని, గతంలోనూ కోర్టులో కేసు వేసి ప్రాజెక్టు ఆపడానికి ప్రయత్నించారని ఆరోపించారు. ప్రత్యామ్నాయ కాల్వను ఏర్పాటు చేయాలని, లేనిపక్షంలో అదే కాల్వను పునరుద్ధరించాలని డిమాండ్‌ చేస్తూ అక్కడే కాసేపు బైఠాయించారు. అనంతరం కొల్లాపూర్‌లో జూపల్లి మాట్లాడుతూ ఈ కాల్వ కింద 2,900 ఎకరాల భూములు ఉన్నాయని, గతేడాది కృష్ణానదిలో నీళ్లున్నా రైతులకు అందించలేకపోయారని, ఈ ఏడాది నీళ్లు అందే అవకాశం ఉన్నా పంటలు పండించుకునే పరిస్థితి లేకుండా చేస్తున్నారని విచారం వ్యక్తం చేశారు. 

మరిన్ని వార్తలు