అండగా నేనుంటా: పొంగులేటి

24 Jul, 2021 03:16 IST|Sakshi
మాజీ ఎంపీ శ్రీనివాసరెడ్డితో ఫోన్‌లో మాట్లాడుతున్న మౌనిక భర్త మహేశ్‌

మౌనిక కుటుంబానికి మాజీ ఎంపీ శ్రీనివాసరెడ్డి హామీ

ములకలపల్లి: కాలికి స్టీల్‌ రాడ్లతో ఏడాదిగా ఇబ్బందిపడుతున్న మౌనికకు అండగా ఉంటానని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం భగత్‌సింగ్‌నగర్‌కు చెందిన గుర్రం మౌనిక ఏడాది కింద రోడ్డు ప్రమాదంలో గాయపడగా, ఆమె ఎడమ కాలికి స్టీల్‌ రాడ్లు వేశారు. వీటిని 15 రోజుల్లో రాడ్లు తొలగించాల్సి ఉన్నా భర్త, కుటుంబం పట్టించుకోకపోవడంతో నడవలేక పాకుతూ గ్రామంలో భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తోంది.

ఈ ఘటనపై ‘ఏడాదిగా.. కాళ్లకు స్టీల్‌ రాడ్లతోనే’శీర్షికన శుక్రవారం ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. దీనిపై పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పందించారు. మౌనిక చికిత్సకు అయ్యే పూర్తి ఖర్చు తాను భరించి, ఖమ్మంలో చికిత్స చేయిస్తానని హామీ ఇచ్చారు. ఆయన సూచన మేరకు మాజీ జెడ్పీటీసీ సభ్యుడు బత్తుల అంజి, ఎస్సై బాల్దె సురేశ్‌ గ్రామానికి వెళ్లి మౌనిక భర్త మహేశ్‌ను శ్రీనివాసరెడ్డితో మాట్లాడించారు. వాహనం ఏర్పాటు చేసి, ఖమ్మంలోని కిమ్స్‌ ఆస్పత్రికి మౌనికను తరలించారు. ఎస్సై సురేశ్‌ రూ.5 వేలు ఆర్థిక సాయం చేశారు.

మరిన్ని వార్తలు