బీజేపీ నేతలు జాతర్లకు వచ్చినట్లు వస్తున్నారు..

27 Nov, 2020 14:08 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మ్యానిఫెస్టోలు, ప్రొగ్రెస్ రిపోర్టులు వెబ్‌సైట్‌లో పెట్టి తీసేయడం టిఆర్ఎస్‌కు మాత్రమే సాధ్యమని మాజీ టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. మేడిపండు కంటే దారుణంగా టీఆర్ఎస్ ప్రొగ్రెస్ రిపోర్టు ఉందని ఎద్దేవా చేశారు. ఎవరి సొమ్మని 17,500 కోట్లు మెట్రోరైలుకు ఖర్చు చేశారని ప్రశ్నించారు. నిజానికి మెట్రో ప్రాజెక్టును కాంగ్రెస్‌ పార్టీ ప్రారంభించగా, కేసీఆర్‌ దాన్ని ఆపేశారన్నారు.  'నీవల్ల ప్రజలకు అసౌకర్యం కలిగింది. ముక్కు నేలకు రాస్తావా? తప్పు ఒప్పుకుంటావా?' అంటూ కేసీఆర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. టీఆర్‌ఎస్‌ విడుదల చేసింది అభివృద్ధి ప్రణాళిక కానే కాదని, అదొక అవినీతి నివేదిక అని, దీనిపై విచారణ జరిపించి నిజనిజాలు బయటకు తేల్చాలని తెలిపారు. 'రాష్ట్రంలో ఒక్క మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి చేయలేదు. యాదాద్రి, భద్రాద్రి ఎక్కడ ఉంది?అన్నీ గత కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిన విద్యుత్ ప్రాజెక్టులే. విద్యుత్ కొనుగోలు చేయడం కూడా ప్రగతేనా? ఐటికి 2100 కోట్లు ఖర్చు చేశామంటున్న టీఆర్ఎస్.. యానిమేషన్ గేమింగ్ 400 కోట్లతో కాంగ్రెస్ ఏర్పాటు చేసింది. ఏడు సంవత్సరాల నుంచి దాన్ని ఎందుకు పూర్తి చేయలేదు. చర్చకు రమ్మంటే ముఖం చాటేసిన టీఆర్ఎస్ నాయకులు ప్రజలకు క్షమాపణలు చెప్పాలి' అని డిమాండ్ చేశారు. (సీఎం దొరగారు మాస్టర్ ప్లాన్: విజయశాంతి)

గ్రేటర్ ఎన్నికల కోసం బీజేపీ నాయకులు జాతరలు, సంతలకు వచ్చినట్లు వస్తున్నారని,  ఒక్క నవోదయ స్కూల్ తెలంగాణకు కేటాయించని స్మృతి ఇరానీ ఏ ముఖం పెట్టుకుని వచ్చారంటూ విమర్శించారు. తెలంగాణకు ఏం చేశారో చెప్పుకుని కేంద్ర మంత్రులు ఓట్లు అడిగితే బాగుండేదన్నారు. ఉత్తరప్రదేశ్లో అశాంతి పాలన చేసిన యోగిఆదిత్య తెలంగాణలో కూడా అలానే ఉండాలని ఇక్కడకు వస్తున్నారా అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎప్పుడూ మతపరమైన వ్యాఖ్యలు చేయదు, వాటిని సమర్దించదని పేర్కొన్నారు. విద్యుత్ చార్జీలు చెల్లించడంలో రైతులు ఆలస్యం చేశారని ట్రాన్స్ ఫార్మర్కు తాళం వేసిన పరిస్థితులు తెలంగాణలో నెలకొనడం దౌర్భాగ్యమని అన్నారు. ('అలా మాట్లాడితే బీజేపీని మతతత్వ పార్టీ అంటున్నారు')

మరిన్ని వార్తలు