దుర్గం చెరువు, ట్యాంక్బండ్లపై ప్రదర్శన
పెద్ద సంఖ్యలో తరలివచ్చిన సందర్శకులు
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్లో వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న జరగనున్న అంతర్జాతీయ ఫార్ములా–ఈ ప్రిక్స్ పోటీలపట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు హెచ్ఎండీఏ అధికారులు ఆదివారం నగరంలో ఫార్ములా–ఈ కార్ల ప్రదర్శన ఏర్పాటు చేశారు. దుర్గం చెరువు, ట్యాంక్బండ్ వద్ద రెండు కార్లను ప్రదర్శించడంతో సందర్శకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఈ కార్లను ఆసక్తిగా తిలకించారు.
ఈ ప్రదర్శనలో హెచ్ఎండీఏ కమిషనర్ అరవింద్ కుమార్, హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ ఎండీ సంతోష్ తదితరులు పాల్గొన్నారు. ఈవీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఈ–కార్ల సామర్థ్యాన్ని చాటేందుకు ఫార్ములా–ఈ పోటీలు జరగనున్నాయి. ఈ ప్రదర్శనలో ఉంచిన జెన్–2 రకానికి చెందిన ఈ–కారు గరిష్టంగా 280 కి.మీ. వేగంతో దూసుకెళ్లగలదు. ఫార్ములా ఈ–ప్రిక్స్ కోసం హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో నెక్లెస్రోడ్డులో ప్రత్యేక ట్రాక్ను ఏర్పాటు చేస్తున్నారు.