మంజీరలో చిక్కుకున్న నలుగురు వ్యక్తులు

21 Oct, 2020 11:52 IST|Sakshi

సాక్షి, మెదక్: జిల్లాలోని కొల్చారం మండలం పోతాంశెట్టిపల్లి శివారులో మంజీరా ఉధృతంగా ప్రవహిస్తోంది. బుధవారం మంజీరా ప్రవాహంలో నలుగురు వ్యక్తులు చిక్కుకున్నారు. చేపలు పట్టడానికి మంజీరా నదిలోకి వెళ్లిన వారంతా ఒక్కసారిగా వరద ఉధృతి పెరగడంతో అక్కడే చిక్కుకుపోయినట్టు తెలుస్తోంది. ఎగువ నుంచి నీళ్లు వదలడంతో ఈ నలుగురు ఉన్న గడ్డ ప్రాంతం చుట్టు పక్కల ఒక్కసారిగా భారీ స్థాయిలో నీరు చేరింది. భారీగా ప్రవహిస్తున్న నీటిలో చిక్కుకున్నవారు పోలీసులు, రెవెన్యూ అధికారులకు ఫోన్‌ ద్వారా సమాచారం అందిచారు. దీంతో మెదక్ రూరల్ సీఐ పాలవెల్లి, పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. వారిని ఒడ్డుకు చేర్చేందుకు మెదక్, కిష్టాపూర్ నుంచి గజ ఈతగాళ్లను పిలిపించారు.  సురక్షితంగా బయటకు తీసుకురావడానికి ముమ్మరంగా  ప్రయత్నాలు సాగుతున్నాయి. మంజీర నదిలో చిక్కుకున్న వారిని కిష్టాపూర్ గ్రామానికి చెందిన దుంపలు ఎల్లం, సాదుల యాదగిరి, మెదక్ పట్టణానికి చెందిన ఆర్నె కైలాఫ్, రాజబోయిన నాగయ్యగా పోలీసులు గుర్తించారు.

మరిన్ని వార్తలు