ఈరోజు పుట్టినవారికి 12 ఏళ్ల వరకు ఉచిత ప్రయాణం 

15 Aug, 2022 03:46 IST|Sakshi

75 ఏళ్ల సీనియర్‌ సిటిజన్లకు ఒకరోజు ఉచిత ప్రయాణం 

పలు రాయితీలు ప్రకటించిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ 

ఖలీల్‌వాడి(నిజామాబాద్‌ అర్బన్‌):  భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాలను పురస్కరించుకొని నేడు (పంద్రాగస్టు) జన్మించిన బాలబాలికలకు 12 ఏళ్ల వయస్సు వచ్చేవరకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నామని ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ తెలిపారు. 75 ఏళ్లు నిండిన సీనియర్‌ సిటిజన్లకు నేడు(సోమవారం) బస్సులో ఉచిత ప్రయాణసౌకర్యం కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ఆర్టీసీ కార్గోలో కిలోబరువు ఉన్న వస్తువులను ఉచితంగా 75 కిలోమీటర్ల దూరం వరకు పంపించడానికి అవకాశం కలిపిస్తున్నట్లు తెలిపారు. ఆదివారం నిజామాబాద్‌ ఆర్టీసీ బస్టాండ్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.

ఈ నెల 15 నుంచి 22 వరకు 75 ఏళ్లు దాటిన వృద్ధులకు తార్నాక ఆర్టీసీ హాస్పిటల్‌లో ఉచిత మెడికల్‌ చెకప్‌లతోపాటు 75 శాతం రాయితీతో మందులను పంపిణీ చేస్తామన్నారు. 16 నుంచి 21 వరకు టీటీడీ ప్యాకేజీలపై రూ.75 రాయితీ అందజేస్తామని చెప్పారు. ఈ నెల 18న 75 చోట్ల రక్తదాన శిబిరాలు నిర్వహించి 7,500 యూనిట్ల రక్తం సేకరిస్తామని తెలిపారు. హైదారాబాద్, ఖమ్మం, నిజామాబాద్‌ బస్టాండ్‌లో 32 మంది స్వాతంత్య్ర సమరయోధుల చరిత్ర తెలిపే స్టాళ్లను ఏర్పాటు చేస్తామన్నారు.
చదవండి: అమృతోత్సాహం.. 76వ స్వాతంత్య్ర దినోత్సవాలకు దేశం సిద్ధం 

మరిన్ని వార్తలు