‘కేంద్ర పాలిత’ యోచన లేదు

15 Feb, 2021 07:19 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న కిషన్‌రెడ్డి

ఎంఐఎంతో పొత్తుపై కేసీఆర్‌ సమాధానం చెప్పాలి 

‘ఎమ్మెల్సీ’లో మళ్లీ రాంచందర్‌రావు గెలుపు ఖాయం  

‘ఖైరతాబాద్‌’ బీజేపీ భేటీలో కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి 

ఖైరతాబాద్‌ (హైదరాబాద్‌): జీహెచ్‌ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్‌ ఎన్నికల్లో ఎంఐఎం మద్దతు ఎలా తీసుకున్నారో ప్రజలకు చెప్పాల్సిన అవసరం సీఎం కేసీఆర్‌కు ఉందని, హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేసే యోచన కేంద్ర ప్రభుత్వానికి లేదని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు. ఖైరతాబాద్‌ నియోజకవర్గ బీజేపీ నాయకుల సమావేశం ఖైరతాబాద్‌ సరస్వతి విద్యామందిర్‌లో ఆదివారం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన కిషన్‌ రెడ్డి మాట్లాడుతూ.. ‘గ్రేటర్‌ ఎన్నికల సమయంలో మాకు ఎంఐఎంతో పొత్తులేదన్నారు. మేము అనుకుంటే సీఎంను గద్దె దించుతామని ఎంఐఎం చెప్పుకొచ్చింది. మరి కేసీఆర్‌ ఏ మొఖం పెట్టుకొని ఎంఐఎం మద్దతుతో మేయర్, డిప్యూటీ మేయర్‌ గెలిపించుకున్నారో ప్రజలకు చెప్పాలి. హైదరాబాద్‌లో పాలన ఎలా ఉండాలి.. పోలీస్, రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ అధికారులు ఎవరుండాలనేది దారుస్సలాంలో నిర్ణయమవుతోంది’అని అన్నారు.  

అప్పుల రాష్ట్రంగా... 
‘తెలంగాణను వ్యతిరేకించిన వారు మంత్రివర్గంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. మిగులు బడ్జెట్, ధనిక రాష్ట్రం.. ఇప్పుడు అప్పుల రాష్ట్రంగా తయా రైంది. ప్రజలు ఓటుతో కేసీఆర్‌ను ముఖ్యమంత్రి సీటులో కూర్చోబెడితే.. అది నా చెప్పుతో సమానమంటారు. ఇది ప్రజలను, రాజ్యాంగాన్ని అవమానించడమే. హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాం తంగా చేసే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి లేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మళ్లీ రాంచందర్‌రావు గెలుపు ఖాయమని’కిషన్‌ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే చిం తల రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

చదవండి: అసదుద్దీన్‌ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు

మరిన్ని వార్తలు