గజ్వేల్‌లో ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ స్టేడియం! 

2 Sep, 2021 03:17 IST|Sakshi

హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ చిక్కులతో సమీపంలో ఉన్న గజ్వేల్‌ వైపు మొగ్గు 

రీజినల్‌ రింగ్‌ రోడ్డుకు సమీపంలో నిర్మాణం 

50–100 ఎకరాల భూసేకరణకు సన్నాహాలు 

గజ్వేల్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ రాబోయే రోజుల్లో అంతర్జాతీయ క్రికెట్‌ పోటీలకు వేదిక కానుంది. ఇక్కడ ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ స్టేడియం నిర్మించే అంశాన్ని ప్రభుత్వం సీరియస్‌గా పరిశీలిస్తోంది. హైదరాబాద్‌లో ఇప్పటికే అన్ని హంగులతో స్టేడి యం అందుబాటులో ఉన్నా, ట్రాఫిక్‌ సమస్యల కారణంగా ఇబ్బందులు తలెత్తుతుండడంతో హైదరాబాద్‌కు సమీపంలో ఉన్న గజ్వేల్‌లో మరో స్టేడి యం నిర్మిస్తే బాగుంటుందనే ఆలోచనకు ప్రభు త్వం వచ్చినట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రాంతంలో ‘రీజనల్‌ రింగు’రోడ్డు నిర్మాణానికి రంగం సిద్ధమవుతుండగా, ఈ రోడ్డుకు అనుసంధానమయ్యేలా స్టేడియం నిర్మాణం చేపట్టాలనుకుంటున్నారు.

సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఈ అంశంపై గతనెల 30న క్రీడల మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ నేతృత్వంలో ఉన్నతస్థాయి సమీక్ష జరిగిన విషయం తెలిసిందే. సీఎం కేసీఆర్‌ చొరవతో ఇక్కడ దేశంలోనే ప్రతిష్టాత్మకంగా చెప్పుకునే హార్టికల్చర్‌ యూనివర్సిటీ, ఫారెస్ట్రీ కళాశాలలు ఏర్పడ్డాయి. 15 టీఎంసీల సామర్థ్యంతో కొండపోచమ్మసాగర్‌ రిజ ర్వాయర్‌తోపాటు వేలాది కోట్ల రూపాయలతో ఎన్నో అభివృద్ధి పనులు జరిగాయి. ఈ క్రమంలోనే అంతర్జాతీయ స్థాయిలో ఈ ప్రాంతం పేరు మారు మోగేలా ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ స్టేడియం నిర్మాణం విషయాన్ని పరిశీలిస్తున్నారు.  

ట్రాఫిక్‌ చిక్కులు తప్పించడానికే..  
గజ్వేల్‌ పట్టణంలో రీజినల్‌ రింగు రోడ్డుకు సమీపంలో స్టేడియం నిర్మిస్తే హైదరాబాద్‌  నుంచి కొద్దిసేపట్లోనే చేరుకునే అవకాశం ఉండటం, ట్రాఫిక్‌ చిక్కులు లేకపోవడం వల్లే ఈ ప్రాంతంపై ప్రధానంగా ఫోకస్‌ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే క్రీడల మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ నేతృత్వంలో జరిగిన సమీక్షలో గజ్వేల్‌లో 50–100 ఎకరాల్లో ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ స్టేడియం కోసం భూసేకరణ, ఫుట్‌బాల్‌ అకాడమీ ఏర్పాట్లపై చర్చించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌గౌడ్‌ క్రికెట్‌ స్టేడియం కోసం స్థల సేకరణకు సిద్దిపేట జిల్లా కలెక్టర్‌కు లేఖ రాస్తున్నట్టు కూడా ప్రకటించారు. దీనిని బట్టి ఇక్కడ  క్రికెట్‌ స్టేడియం నిర్మా ణం త్వరలోనే ఖరారు కాబోతుందనే విషయం స్పష్టమవుతోంది. సమీక్షలో రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ గజ్వేల్‌లో క్రికెట్‌ స్టేడియం నిర్మించే విషయాన్ని సీఎం కేసీఆర్‌ సీరియస్‌గా పరిశీలిస్తున్న మాట వాస్తవమేనని చెప్పారు.  

మరిన్ని వార్తలు