నేడే ‘గణ’ వేడుక

19 Sep, 2021 03:06 IST|Sakshi
శనివారం రాత్రి ఖైరతాబాద్‌  మహా గణపతిని  దర్శించుకునేందుకు  భారీగా తరలివచ్చిన ప్రజలు

బొజ్జ గణపయ్యకు ఘనంగా వీడ్కోలు పలకనున్న నగర వాసులు

బాలాపూర్‌ నుంచి హుస్సేన్‌సాగర్‌ వరకు పకడ్బందీ ఏర్పాట్లు  

విధుల్లో వేలాది మంది సిబ్బంది

అప్రమత్తమైన అన్ని విభాగాలు

జీహెచ్‌ఎంసీ, విద్యుత్, జలమండలి, రవాణా, హెచ్‌ఎండీఏ, పోలీస్‌ శాఖలతో సమన్వయం

ప్రత్యేక బస్సులు, మెట్రో, ఎంఎంటీఎస్‌ సర్వీసులు సైతం..

సాక్షి, హైదరాబాద్‌: సాగరం సన్నద్ధమైంది. గణనాథుడికి ఘనమైన స్వాగతం చెప్పేందుకు అలలు ఉవ్విళ్లూరుతున్నాయి. మరి కొద్ది సేపట్లో  ప్రారంభం కానున్న మహా ‘గణ’ ప్రభంజనానికి సకల ఏర్పాట్లు పూర్తయ్యాయి. నగరంలో వందేళ్ల క్రితమే మొదలైన వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు అంచెలంచెలుగా మహానగరమంతా  విస్తరించుకున్నాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు బొజ్జగణపయ్యకు భక్తజనం ఘనంగా వేడుకలు నిర్వహిస్తూనే ఉన్నారు. చదవండి: గణేష్‌ నిమజ్జనం: హైదరాబాద్‌ మెట్రో ప్రత్యేక సేవలు

తొమ్మిది రోజుల  పాటు కన్నుల పండువగా సాగే ఉత్సవాలు వైవిధ్యభరితమైన హైదరాబాద్‌ మహానగర చరిత్రకు ఒక సమున్నతమైన  ఆధ్యాత్మిక ఆవిష్కరణ. చిన్న చిన్న గల్లీలు, బస్తీలు, కాలనీలు, అపార్ట్‌మెంట్‌లు మొదలుకొని ప్రధాన రహదారుల వరకు  అడుగడుగునా కొలువుదీరిన విభిన్న మూర్తుల గణనాథుడి ఉత్సవంతో నగరం సరికొత్త కాంతులను సంతరించుకుంటుంది. గతేడాది కోవిడ్‌ కారణంగా దేవదేవుడికి సాదాసీదాగా పూజలు చేసిన భక్తజనం ఈసారి ఘనంగా వేడుకలు నిర్వహించింది.

నగరమంతటా వేలాది విగ్రహాలను ప్రతిష్టించారు. ఇష్టదైవాన్ని ఆనందో త్సాహాలతో కొలిచి మొక్కారు. ‘ కరోనా వంటి మహమ్మారులు మరోసారి ప్రబలకుండా మమ్మల్ని కాపాడవయ్యా బొజ్జ గణపయ్యా’ అంటూ  భక్తులు వేడుకున్నారు. మరి కొద్ది గంటల్లో ప్రారంభం కానున్న లంబోదరుడి నిమజ్జన శోభాయాత్రతో భక్తజన సాగరం కనువిందు చేయనుంది. శోభాయాత్రలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ప్రభుత్వం వివిధ శాఖల సమన్వ యంతో సకల ఏర్పాట్లు చేసింది. బాలాపూర్‌ నుంచి మొదలయ్యే నిమజ్జన శోభాయాత్ర సాఫీగా సాగేందుకు తగిన చర్యలు తీసుకుంది.

వివిధప్రాంతాల నుంచి హుస్సేన్‌సాగర్‌కు శోభాయాత్ర మార్గాలు:  320 కి.మీ.
ఎప్పటికప్పుడు వ్యర్థాలు తొలగించి పరిశుభ్రం చేసేందుకు యాక్షన్‌ టీమ్స్‌ : 162
గణేశ్‌ యాక్షన్‌ టీమ్స్‌ సిబ్బంది : 8,116
నిమజ్జనం జరిగే ప్రాంతాలు : 33 చెరువులు, 25 కొలనులు. 
విగ్రహాల నిమజ్జనానికి అందుబాటులో ఉన్న  క్రేన్లు: 316
ట్యాంక్‌బండ్‌ పరిసరాల్లో క్రేన్లు: 40
అంచనా వ్యర్థాలు: 3,910 మెట్రిక్‌ టన్నులు
చెత్తను తరలించేందుకు పెద్ద వాహనాలు: 44, మినీ టిప్పర్లు: 39, జేసీబీలు:21
ఫైర్‌ వాహనాలు : 38
బారికేడింగ్స్‌ : 12 కి.మీ.
వాటర్‌ప్రూఫ్‌ టెంట్లు : 15
తాగునీటి పంపిణీ శిబిరాలు: 101
అందుబాటులో వాటర్‌ప్యాకెట్లు: 30 లక్షలు 
హుస్సేన్‌సాగర్‌ వద్ద ట్రాన్స్‌ఫార్మర్లు: 48
అన్ని నిమజ్జనప్రాంతాల్లో ట్రాన్స్‌ఫార్మర్లు: 101
తాత్కాలిక వీధి దీపాలు: 41,284
ట్యాంక్‌బండ్‌ పరిసరాల్లో  ఎల్‌ఈడీ లైట్లు: 2600
హుస్సేన్‌సాగర్‌ వద్ద బోట్లు : 9
ట్యాంక్‌బండ్‌  వద్ద స్విమ్మర్లు: 32 
పంపిణీకి అందుబాటులో  మాస్కులు: 5 లక్షలు
శోభాయాత్ర మార్గంలో, చెరువుల వద్ద శానిటైజర్లు
విధుల్లో ఉండే పోలీసు సిబ్బంది: 19000
ట్యాంక్‌బండ్‌పై అంబులెన్సులు: 2 పోలీస్‌ కంట్రోల్‌రూమ్స్‌: 2
ఆయా ప్రాంతాల్లో వాచ్‌ టవర్లు 
ఎన్టీఆర్‌ మార్గ్‌లో వాటర్‌బోర్డు, టీఎస్‌ఎస్‌ పీడీసీఎల్, జీహెచ్‌ఎంసీల కంట్రోల్‌రూమ్స్‌. 
సుప్రీంకోర్టుకు చేసిన విజ్ఞప్తికనుగుణంగా  చెరు వులు, కొలనులు కలుషితంకాకుండా విగ్రహాలు వేసిన వెంటనే తొలగించేందుకు ఏర్పాట్లు.
హుస్సేన్‌సాగర్‌ ప్రాంతంలో కోవిడ్‌ నిరోధక వ్యాక్సినేషన్‌ శిబిరం


శనివారం రాత్రి హుస్సేన్‌సాగర్‌లో వినాయక విగ్రహ నిమజ్జనం 

హెలికాప్టర్‌ నుంచి పర్యవేక్షణ
మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, మహ మూద్‌అలీలతోపాటు డీజీపీ మహేందర్‌రెడ్డి, నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌లు మధ్యాహ్నం ఒంటి గంటకు, సాయంత్రం 4 గంటలకు శోభాయాత్ర, నిమజ్జనాలను హెలికాప్టర్‌లో ఏరియల్‌వ్యూ ద్వారా పరిశీలిస్తారు. 

వాటర్‌ బోర్డు మంచి నీటిసరఫరా
గణేష్‌ నిమజ్జనానికి తరలివచ్చే భక్తులకు తాగునీటిని అందించేందుకు జలమండలి వాటర్‌ క్యాంపులను ఏర్పాటు చేసింది. 119 వాటర్‌ క్యాంపులను ఏర్పాటు చేసి, 30.72 లక్షల వాటర్‌ ప్యాకెట్లను అందుబాటులో ఉంచినట్లు ఎండీ దానకిశోర్‌  తెలిపారు. శోభయాత్ర జరిగే అన్ని ప్రాంతాల్లో జలమండలి వాటర్‌ క్యాంపులు ఏర్పాటు చేశారు.అవసరమైన చోట్ల డ్రమ్ముల్లో కూడా తాగునీటిని అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు. క్వాలిటీ అస్యూరెన్స్‌ టీమ్‌(క్యూఏటీ)లు ఎప్పటికప్పుడు వాటర్‌ క్యాంపుల్లో మంచినీటి నాణ్యతను పరీక్షించడంతో పాటు క్లోరిన్‌ లెవల్స్‌ తగిన మోతాదులో ఉండేలా చూస్తాయన్నారు.

అర్ధరాత్రి 2 గంటల వరకు మెట్రో
నిమజ్జనానికి తరలి వచ్చే భక్తుల కోసం ఆదివారం ఉదయం నుంచి అర్ధరాత్రి దాటిన తరువాత 2 గంటల (సోమవారం తెల్లవారు జాము)వరకు అన్ని రూట్లలో మెట్రో రైళ్లు నడుపనున్నట్లు అధికారులు తెలిపారు.
నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ట్యాంక్‌బండ్‌ హుస్సేన్‌సాగర్‌కు చేరుకునేం దుకు వీలుగా ఆర్టీసీ 565 బస్సులను నడిపేందుకు ఏర్పాట్లు చేసింది. దిల్‌సుఖ్‌నగర్, ఎల్‌బీనగర్, తదితర ప్రాంతాల నుంచి ఓల్డ్‌ ఎమ్మెల్యే క్వార్టర్స్‌ వరకు, ఉప్పల్, సికింద్రాబాద్, తదితర ప్రాంతాల నుంచి ఇందిరాపార్కు వరకు, మెహదీపట్నం, పటాన్‌చెరు, బీహెచ్‌ఈఎల్, తదితర ప్రాంతాల నుంచి ఖైరతాబాద్, లక్డీకాపూల్‌ వరకు ఈ బస్సులు నడుస్తాయి. 
ఆదివారం రాత్రి 10 గంటల నుంచి సోమ వారం ఉదయం 4 గంటల వరకు భక్తులకు అందుబాటులో ఉండేవిధంగా 8 ఎంఎం టీఎస్‌ స్పెషల్‌ ట్రైన్స్‌ నడిపేందుకు దక్షిణమ ధ్య రైల్వే చర్యలు చేపట్టింది. లింగంపల్లి– సికింద్రాబాద్, నాంపల్లి– లింగపల్లి, ఫలక్‌నుమా– సికింద్రాబాద్, నాంపల్లి– ఫలక్‌నుమా రూట్లలో ఈ రైళ్లు నడుస్తాయి.

మరిన్ని వార్తలు