ఫంక్షన్‌ హాల్‌లో రౌడీషీటర్ల విందు భోజనం.. ఎందుకంటే?

9 Jan, 2023 21:32 IST|Sakshi

ఖలీల్‌వాడి(నిజామాబాద్‌ జిల్లా): రౌడీషీటర్లు ఐక్యమత్యంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. నగరంలో గత ఆదివారం పుట్టిన రోజు వేడుకల్లో రౌడీషీటర్‌ ఇబ్రహీం చావూస్‌ (29)ను రౌడీషీటర్లు హతమార్చిన విషయం విధితమే. ఈ హత్యకు ప్రధానకారణం పీడీఎస్‌ బియ్యం, భూ తగాదాల్లో వచ్చిన పంపకాలతోనే జరిగిందని పోలీసులు చెబుతున్నారు. దీంతో ఇల్లీగల్‌ దందాపై పోలీసు కమిషనర్‌ నాగరాజు సీరియస్‌గా దృష్టి సారించారు.

అంతేకాకుండా ఇబ్రహీం హత్య కేసు లో 12 మంది నిందితులను అరెస్ట్‌ చేసి, రిమాండ్‌కు తరలించారు. ముగ్గురు పరారీలో ఉన్నారు. పోలీసుల రియాక్షన్‌తో రౌడీషీటర్లు తమకు ఇబ్బందులు తప్పవని భావించారు. తమ దందా దెబ్బతింటుందని.. విభేదాలు తొలగించుకుని ముందుకుసాగేందుకు రెండు పార్టీలకు చెందిన నేతలను ఆశ్రయించినట్లు తెలిసింది.

దీంతో రౌడీషీటర్ల మధ్య విభేదాలు రాకుండా ఉండేందుకు సదరు నేతలు రంగంలోకి దిగారు. రౌడీషీటర్ల మధ్య సఖ్యత కోసం వారితో మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది. దీంతో రెండు రోజుల క్రితం నగరంలోని ఒకటో టౌన్‌ పోలీస్‌స్టేష న్‌ పరిధిలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో ముగ్గురు రౌడీషీటర్ల అనుచరుల సమావేశం జరిగింది. దీని వెనుక రెండు పార్టీలకు చెందిన నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. సమావేశంలో భూ వివాదాలు, పీడీఎస్‌ బియ్యం, గంజాయివంటి వాటిలో వచ్చిన లాభాలు, మా మూళ్లను అందరూ సమానంగా పంచుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవద్దని, ఒకరు వెళ్లిన పనులకు మరోవర్గం వెళ్లకుండా ఉండాలని చెప్పుకున్నట్లు తెలిసింది. ఎక్కడ ఏ పనులు చేస్తున్నామో సమాచారం ఒకరికొకరు ఇచ్చుకొని ముందుకు వెళ్లాలని, వచ్చిన ఆదాయాన్ని ముగ్గురు సమానంగా పంచుకోవాలని ఒప్పందానికి వచ్చినట్లు సమాచారం. దీంతో వివాదాలు రాకుండా ఉంటాయని, పోలీసుల దృష్టి ఉండకుండా ఉంటుందని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
చదవండి: వనస్థలిపురం దోపిడీ కేసులో కొత్త ట్విస్ట్‌.. డైరీలో షాకింగ్‌ విషయాలు

సమావేశంలో చర్చించిన నిర్ణయాలపై అందరూ సమ్మతించడంతో అందరూ కలిసి విందు భోజనం ఏర్పాటు చేసుకున్నట్లు తెలిసింది. ఇబ్రహీం హత్య తర్వాత పోలీసులు ఇల్లీగల్‌ దందాలు, రౌడీషీటర్లపై దృష్టి సారించడంతో ఎలాంటి  గొడవలు లేక పోవడంతో అక్కడి ప్రజలు ప్రశాంతంగా ఉన్నా రు. రౌడీషీటర్ల సమావేశం అనంతరం వారి కదలిక లు మళ్లీ ప్రారంభం కావడంతో ఇబ్బందులు తప్ప డం లేవని, దీనిపై పోలీసులు దృష్టి సారించాలని నగర ప్రజలు కోరుతున్నారు.   

మరిన్ని వార్తలు