డివిజన్ చుట్టకుండానే ముగుస్తున్న గడువు
నేటితో ప్రచారం సమాప్తం
కేవలం వారం రోజుల్లోనే ఎన్నికల ప్రచారం
మద్దతు దొరికే ప్రాంతాలపైనే అభ్యర్థుల ఫోకస్
తమ ప్రచారం కంటే అగ్రనేతల మాటలపైనే ఆశలు
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల హీట్ పీక్స్కు వెళ్లడంతో అభ్యర్థులు సుడిగాలి పర్యటన చేస్తున్నారు. జెట్ స్పీడ్ ప్రచారం నిర్వహిస్తున్నారు. అయినా డివిజన్ మొత్తాన్ని చుట్టేయడం సాధ్యంకావడంలేదు. ఇదీ ఈసారి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆయా పార్టీల అభ్యర్థుల ప్రచారం తీరు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) ఎన్నికల ప్రచారపోకడ గతం కంటే భిన్నంగా సాగుతోంది. సాధారణంగా ఎన్నికల ప్రచారంలో డివిజన్ మొత్తాన్ని చుట్టి, చివరలో ముఖ్యమైన ప్రాంతాల్లో రెండోసారి కూడా ప్రచారం చేస్తారు. కానీ, ఈసారి డివిజన్వ్యాప్తంగా అభ్యర్థి ప్రచారం చేసే వీలు చిక్కలేదు. ఆదివారం ప్రచారం ముగుస్తుండటంతో అభ్యర్థుల్లో కొంత ఆందోళన వ్యక్తమవుతోంది. అన్ని పార్టీలు, అన్ని డివిజన్లలో ఇదే పరిస్థితి నెలకొంది.
బస్తీల్లోనే కుస్తీ
ఎన్నికల తేదీలు ప్రకటించిన తర్వాత పక్షం రోజుల్లోనే ఎన్నికల తంతు ముగించాల్సి వస్తోంది. అభ్యర్థులను ప్రకటించి, బీఫామ్స్ అందించిన తర్వాత ప్రచారానికి కేవలం వారం మాత్రమే మిగిలింది. ఈ వారం రోజుల్లో డివిజన్లోని బస్తీలు, కాలనీలన్నింటిలో ప్రచారం చేయటం దాదాపు అసాధ్యమైపోయింది. దీంతో అభ్యర్థులు జెట్ స్పీడ్తో గరిష్ట ప్రాంతాలను కవర్ చేసేలా ప్రణాళిక రూపొందించకున్నారు. దాదాపు మూడొంతుల ప్రాంతాలను చుట్టేయగలిగారు.
అగ్రనేతల ప్రచారంపైనే ఆశలు..
గతంలో ఎన్నడూ లేనట్టుగా ఈసారి బల్దియా ఎన్నికల్లో ఆయా పార్టీల అగ్రనేతల ప్రచారం హోరెత్తుతోంది. కాంగ్రెస్ తరఫున ఒకరిద్దరు పెద్ద నేతలు మాత్రమే పాల్గొంటుండగా, టీఆర్ఎస్, బీజేపీలు ఒకదాన్ని మించి మరొకటి అన్నట్టుగా అగ్రనేతలతో ప్రచారం చేయిస్తున్నాయి. నిత్యం డజన్ ర్యాలీలు, బహిరంగ సభలతో హోరెత్తిస్తున్నాయి. కొన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా భారీ సభలు నిర్వహిస్తున్నారు. దీంతో అభ్యర్థులు వారి ప్రచారంపైనే ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. ఇంటింటి ప్రచారం కంటే అగ్రనేతల మాటలే ఎక్కువగా ఓట్లు తెచ్చిపెడతాయనీ, హామీలు, వరాలు వారి మాటల్లోనే పారుతున్నాయనీ భావించిన అభ్యర్థులు బస్తీల్లో ఓటర్లకు నమస్కారం చేసుకుంటూ ముందుకు సాగటం తప్ప పెద్దగా హామీలు ఇవ్వలేకపోతున్నారు.
విజయం సాధిస్తే తమ పార్టీ ఏం చేస్తుందనే విషయాన్ని అగ్రనేతలే వివరిస్తున్నారు. వాటికి మీడియా ద్వారా భారీ ప్రచారమే సాగుతోంది. అన్ని పార్టీలు సొంతంగా సోషల్ మీడియ బృందాలు ఏర్పాటు చేసుకుని, అగ్రనేతల ప్రసంగాలను వాట్సాప్ గ్రూపులు, యూట్యూబ్ ఛానళ్ల ద్వారా జనంలోకి తీసుకెళ్తున్నారు.గెలుపోటములపై అవి ప్రభావం చూపుతాయన్న అభిప్రాయంతో అభ్యర్థులున్నారు. అగ్రనేతలు కొన్ని డివిజన్లకే పరిమితం కావటంతో వారు అడుగుపెట్టని ప్రాంతాల అభ్యర్థుల్లో కొంత ఆందోళన కనిపిస్తోంది.