ఇది అందరి హైదరాబాద్‌: కేటీఆర్

20 Nov, 2020 18:06 IST|Sakshi

అన్ని కోణాల్లో పరిశీలించి అభ్యర్థులను ఎంపిక చేశాం‌

సాక్షి, హైదరాబాద్‌: గ్రేటర్‌ ఎన్నికల ప్రక్రియ నేమినేషన్‌ల పర్వం ఈరోజుతో ముగిసింది. గత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 99 సీట్లు సాధించిన అధికారి పార్టీ టీఆర్‌ఎస్‌ తాజా ఎన్నికల్లోనూ సత్తా చాటాలని భావిస్తోంది. 100కు పైగా స్థానాలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో మంత్రి కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్‌) హైదరాబాద్‌ ప్రగతిపై శుక్రవారం నివేదిక విడుదల చేశారు. జీహెచ్‌ఎంసీ బరిలో నిలిచిన టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు కేటీఆర్‌ బీ ఫారాలను అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఇది అందరి హైదరాబాద్‌.. అందరి కోసం ప్రభుత్వం పని చేస్తుంది’’ అని అన్నారు. సీఎం కేసీఆర్‌ మహిళా పక్షపాతి అని, జీహెచ్‌ఎంసీ చట్టాన్ని మార్చి 50 శాతం రిజర్వేషన్లను మహిళకు కేటాయించామని చెప్పారు. ఈ ఎన్నికల్లో వారికి 85 స్థానాలు ఇచ్చామని వెల్లడించారు. (చదవండి: బరిలో టీఆర్‌ఎస్‌ గెలుపు గుర్రాలు!)

మాటల్లో సామాజిక న్యాయం కాదు.. చేతల్లో సామాజిక న్యాయం చేసి చూపించామని ఆయన వ్యాఖ్యానించారు. అదే విధంగా బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించామని, మైనార్టీ అభ్యర్థులకు 17 స్థానాలను ఇచ్చామని తెలిపారు. అన్ని కోణాల్లో పరిశీలించి అభ్యర్థుల ఎంపిక చేశామని మంత్రి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి వచ్చి హైదరాబాద్‌లో స్థిరపడిన వారికి సైతం 8 స్థానాలు కేటాయించామని, అంతేగాక రాజస్థానీ వాళ్లకు కూడా సీట్లు కేటాయించామన్నారు. మేము కూడా సిద్దిపేట నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడినవారమే అని ఆయన అన్నారు. అయితే టికెట్‌ రాని వారి ఇంటికి వెళ్లి వారి సహకారాన్ని కోరాలని కేటీఆర్‌ అభ్యర్థులను కోరారు. (చదవండి: గ్రేటర్‌ ఎన్నికలు: భారీ బందోబస్తు..)

మరిన్ని వార్తలు