ఓల్డ్‌ మలక్‌పేటలో ముగిసిన రీ పోలింగ్

3 Dec, 2020 19:03 IST|Sakshi
ఫైల్‌ ఫొటో

సాక్షి, హైదరాబాద్‌: ఓల్డ్‌ మలక్‌పేట వార్డు(డివిజన్‌) జరిగిన రీ పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం ఆరు గంటల వరకూ క్యూలైన్‌లో ఉన్నవారికి ఓటు వేసేందుకు అవకాశం ఉంది. కాగా బ్యాలెట్‌ పేపర్‌లో సీపీఐ అభ్యర్థి గుర్తు తప్పుగా ముద్రించడంతో రీపోలింగ్‌ జరుగుతున్న విషయం తెలిసిందే. పోలింగ్‌ ముగిసిన వెంటనే ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు విడుదల అయ్యాయి. అన్ని ఎగ్జిట్‌ పోల్స్‌ అధికార టీఆర్‌ఎస్‌కే పట్టం కట్టాయి. ఇప్పటివరకూ వచ్చిన ఎగ్జిట్‌ పోల్స్‌లో కారు జోరే కొనసాగుతుంది. రేపు ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్‌ ప్రారంభం కానుంది. 

ఉదయం 11 గంటల వరకు:
రీపోలింగ్‌ కట్టు దిట్టమైన భద్రత నడుమ కొనసాగుతోంది. తాజాగా ఉదయం 11 గంటలకు వరకు పోలింగ్‌ శాతం 13.41గా నమోదు అయింది.

ఉదయం 9 గంటలకు వరకు:
ఓల్డ్‌ మలక్‌పేట వార్డు( డివిజన్‌)లో పోలింగ్‌ కొనసాగుతోంది. ఉదయం 9గంటల వరకు 4.4 శాతం పోలింగ్‌ నమోదైనట్లు అధికారులు తెలిపారు. కాగా, ఉదయం 7గంటలకు ప్రారంభమైన  పోలింగ్‌ సాయంత్రం 6గంటల వరకు జరుగుతుంది. భారీ భద్రత నడుమ రీపోలింగ్‌ ప్రక్రియ సాగుతోంది. 

వార్డులో మొత్తం ఓట్లు: 54,655 
పురుషులు : 27889 
మహిళలు: 26763 
ఇతరులు 3 
పోలింగ్‌ కేంద్రాలు 69 
విధుల్లో ఉండే మైక్రో అబ్జర్వర్లు 12  మంది. 
వెబ్‌కాస్టింగ్‌ జరిగే పోలింగ్‌ కేంద్రాలు:23 

నేడు సెలవు:
జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఓల్డ్‌ మలక్‌పేట డివిజన్‌ పరిధిలో పోలింగ్‌ సందర్భంగా గురువారం సెలవు ప్రకటించినట్లు హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ శ్వేతా మహంతి తెలిపారు. ఎన్నికలు జరిగే ప్రాంతమైన ఓల్డ్‌ మలక్‌పేట డివిజన్‌లో అన్ని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థలు, విద్యా సంస్థలు, ప్రభుత్వ, ప్రయివేటు సంస్థలు, వ్యాపార కేంద్రాలకు సెలవు వర్తిసుందన్నారు. అన్ని కార్యాలయ అధిపతులు ఈ ఆదేశాలను పాటించాలని సూచించారు.  

 48 గంటల పాటు ర్యాలీ నిషేధం
ఉదయం 7 గంటలకు ఓల్డ్ మలక్ పేట్‌లో ప్రారంభమైన  రీపోలింగ్  69 పోలింగ్ కేంద్రాల్లో జరుగుతుందని హైదరాబాద్‌ సీపీ అంజనీ కుమార్‌ అన్నారు. పెట్రోలింగ్, పోలీస్ సిబ్బందితో పూర్తి బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుందన్నారు. రేపటి కోసం కూడా భారీ బందోబస్తు ఉందన్నారు. 200 మీటర్ల పరిధిలో ఎవరికి అనుమతి ఉండదని,.కేవలం అనుమతి పత్రం ఉన్నవారికి మాత్రమే కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతి ఉన్నట్లు తెలిపారు. 48 గంటల పాటు ర్యాలీ నిషేధించినట్లు వెల్లడించారు. ఓటర్లందరు చాలా ఉత్సాహంగా ఓటింగ్‌లో పాల్గొంటున్నారని, వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.

మరిన్ని వార్తలు