జీహెచ్‌ఎంసీ ఎన్నికలు: తొలి జాబితా వచ్చేసింది

18 Nov, 2020 16:37 IST|Sakshi

తొలి జాబితా విడుదల చేసిన వామపక్షాలు

అందరికంటే ముందుగానే అభ్యర్థుల జాబితా

సాక్షి, హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్ ఎన్నికల నగారా మోగడంతో హడావిడి మొదలైంది. ఈ సందడిలో ప్రధాన ఘట్టమైన అభ్యర్థుల ఎంపికలో వామపక్షాలు ఒక అడుగే ముందే ఉన్నాయి.  జీహెచ్ఎంసీలో ఉమ్మడిగా బరిలో దిగనున్న సీపీఎం, సీపీఐ  తొలి విడత  అభ్యర్థుల జాబితాను విడుదల చేయడం విశేషం.    (వరద సాయం; ఈసీ కీలక ఆదేశాలు)

ఈ సందర్భంగా సీపీఐ  రాష్ట్ర కార్యదర్శి  డీజీ నర్సింహారావు మాట్లాడుతూ గత 5 సంవత్సరాలలో ప్రజల సమస్యలేవీ తీరలేదంటూ  టీఆర్‌ఎస్‌ పార్టీపై విమర్శలు గుప్పించారు. దుబ్బాక హడావిడి అయిపోక ముందే దొంగచాటుగా ఎన్నికలను నిర్వహిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల కమిషన్ కూడా ప్రభుత్వం ఏమి చెయ్యమంటే అదే చేస్తుందని వ్యాఖ్యానించారు. రెండు నెలల ముందే ఎన్నికలను ప్రకటించారన్నారు. అలాగే వరద బాధితుల సహాయం నిజమైన వ్యక్తులకు చేరడంలేదన్నారు. మొన్నటి వరకు వరద బాధితులకు 10వేల రూపాయలు ఇస్తే ప్రస్తుతం అందరికి ఇస్తున్నారని,ఎన్నికలకు ముందు ప్రజలను తమవైపునకు తిప్పుకునేందుకే ఇదంతా చేస్తున్నారని మండిపడ్డారు.  వీటన్నింటినీ గమనించి  ప్రజలందరూ తమ పార్టీ  ఓటు వెయ్యాలని  ఆయన విజ్ఞప్తి చేశారు.

సీపీఎం అభ్యర్థుల మొదటి జాబితా
చర్లపల్లి  3 డివిజన్‌  - పి . వెంకట్
జంగమేట్ 45వ డివిజన్‌ - ఎ.కృష్ణ
బాగ్ అంబర్‌పేట్‌ 54వ డివిజన్‌ - ఎం. వరలక్ష్మి
రాంనగర్  87వ డివిజన్‌ -ఎం. దశరథ్
అడ్డగుట్ట  142వ డిజిజన్‌ - టి . స్వప్న

సీపీఐ అభ్యర్థుల మొదటి జాబితా
హిమాయత్ నగర్  బి. చాయ దేవి
షేక్‌పేట్  షైక్ షంషుద్దీన్ అహ్మద్
తార్నాక  - పద్మ
లలిత బాగ్  - మహమ్మద్ ఆరిఫ్ ఖాన్
ఓల్డ్ మలక్‌పేట్‌ -ఫిరదౌజ్ ఫాతిమా
ఉప్పుగూడ - సయెద్ అలీ

మరోవైపు దుబ్బాక ఉపఎ‍న్నికలలో తగిలిన ఎదురుదెబ్బ నేపథ్యంలో  అధికార టీఆర్‌ఎస్‌కు  ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి.  దీంతో జీహెచ్‌హెంసీలో టీఆర్‌ఎస్‌ నుంచి మేయర్ అభ్యర్థి ఎవరు అనేది హాట్‌ టాపిక్‌గా మారింది. జనరల్ కేటగిరీ కింద మహిళకు కేటాయించడంతో మేయర్ అభ్యర్థి విషయంలో కేసీఆర్ వ్యూహం  ఏమిటనేది ఆసక్తికరంగా మారింది. ఈ సాయంత్రం 6 గంటలకు పార్టీ జాబితా విడుదల చేయనుంది. దుబ్బాక స్థానాన్ని కైవసం చేసుకున్న జోష్ మీద ఉన్న భారతీయ జనతా పార్టీ ఆ ఉత్సాహాన్ని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో కూడా కొనసాగించాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ నేపథ్యంలోనే అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తోంది. గెలుపే లక్ష్యంగా కసరత్తును ముమ్మరం చేసింది.

అటు  కాంగ్రెస్‌ పార్టీలో గ్రేటర్‌ ఎన్నికల  హడావిడి కనపించడం లేదు. పార్టీ స్పందన కోసం కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు గాంధీ భవన్‌లో ఎదురు చూస్తున్నారు.  పార్టీతో అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్న గ్రేటర్ కాంగ్రెస్ నేత అంజన్ కుమార్ యాదవ్ వైఖరితో పార్టీ కార్యాలయంలో నేతల జాడకోసం  గ్రేటర్ ఆశావహులు ఎదురు తెన్నులు చూస్తున్నారు. ఇవాళ సాయంత్రం తొలి జాబితా విడుదలయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.

>
మరిన్ని వార్తలు